ఇండియాను పట్టుకున్న దుష్టగ్రహం ఎవరో తెలుసా?

తనదైన స్టైల్లో ఎప్పుడూ విమర్శలు చేసే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గోన్న ఆయన ప్రధానిపై అంతెత్తున లేచారు. ఇండియాను ఇప్పుడో దుష్ట గ్రహం పట్టుకుందని దాని పేరే నరేంద్రమోడీ అన్నారు. మోడీ ప్రమాణం స్వీకారం చేశాక దేశంలో నీటి కష్టాలు పెరిగాయని, తీవ్ర కరువు వర్షాభావం దేశాన్ని పట్టి పీడించడం ప్రారంభమైందన్నారు. అక్కడితో ఆగకుండా గురువులు, బాబాల ఆస్తులపై విచారణ జరిపించాలని లాలూ డిమాండ్ చేశారు. ఈ వార్తలు స్థానికంగా సంచలన సృష్టించాయి.