లైంగిక వేధింపుల కేసుపై లక్ష్మీపార్వతి రియాక్షన్

 

లక్ష్మీపార్వతి తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ కోటి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్త గంటల్లో వైరల్ గా మారింది. అయితే ఒక పెద్దావిడ మీద ఇలాంటి నిందలు వేయడం ఏంటంటూ పలువురు తప్పుపట్టారు. తాజాగా లక్ష్మీపార్వతి ఈ విషయంపై స్పందించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డిన కలిసిన ఆమె.. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను అగౌరవ  పరుస్తూ విమర్శలు చేస్తున్నారని.. ఏప్రిల్ 4వ తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తనపై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తిని బిడ్డలాగా భావించానన్నారు. నా పరువు, మర్యాదలు కాపాడాలని డీజీపీని కోరానని, దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలి విజ్ఞప్తి చేశానన్నారు. డీజీపీ వెంటనే స్పందించి హైదరాబాద్‌ కమిషన్‌కు చెప్పారని.. హైదరాబాద్‌ సీపీకి కలుస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు.