జేసి సోదరులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

 

 

 

జేసి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని గత కొంతకాలంగావార్తలు వస్తున్నాయి. అయితే వీరి రాక ఇప్పుడు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాబు జిల్లా నేతలతో చర్చలు జరిపి అందరిని ఒప్పించారట. జేసి సోదరుల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిటాల సునీతను కూడా రాజీపడ్డారని అంటున్నారు.

 

సోమవారం టిడిపి సీమాంధ్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు, ఆ తరువాత అనంతపురం జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జిల్లాలో పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అలాగే నేతలతో జేసి సోదరులు చేరికపై చర్చించి..నేతలను ఒప్పించారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.