ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి అనుమానాస్పద మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మణిపూర్‌కు చెందిన జేఆర్ ఫిలెమన్ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు..అతని కోసం తోటి విద్యార్థులు, పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే ఈ ఉదయం బ్రహ్మాపుత్ర హాస్టల్ గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా ఫిలెమన్ విగతజీవిగా కనిపించాడు. అయితే ఇప్పటికే నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. నజీబ్ జాడ కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వైస్ ఛాన్సలర్ సహా సీనియర్ అధికారులను కార్యాలయంలో ఒక రాత్రి మొత్తం నిర్భంధించి ధర్నా నిర్వహించారు. అయితే ఇంతలోనే ఫిలెమన్ మరణం వర్శిటీలో తీవ్ర అలజడిని సృష్టిస్తోంది.