తెలంగాణపై పవన్ షాకింగ్! 

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల కొత్తపార్టీ సన్నాహాలు చేస్తుండటం కాక రేపుతుండగా.. జనసేన కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేనాని కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీ వీర మహిళలతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. 

జనసేన వీర మహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాల కోసం జనసేన కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ సామాజిక విప్లవం కోసం జనసేన అలుపెరగని పోరాటం చేస్తోందని వెల్లడించారు. తెలంగాణపై గౌరవంతోనే ఇంతకాలం పార్టీని విస్తరించలేదని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ పురుడు పోసుకుంది తెలంగాణ గడ్డపైనే అని గుర్తుచేసుకున్నారు. జనసేన తొలి ఎంపీటీసీ తెలంగాణలోనే గెలుచుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. 

 తెలంగాణలో తన బలం ఏంటో తనకు తెలుసని, జనసేన కన్నా తనపైనే తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఎక్కువ అని పవన్ కల్యాణ్ చెప్పారు.  తనకు జన్మనిచ్చింది ఆంధ్రా అయితే.. పునర్జన్మనిచ్చింది మాత్రం తెలంగాణ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భావసారూప్యం ఉన్న వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నానని తెలిపారు జనసేనాని.