ఆ ఉగ్రవాదులకి మనిషి మాంసం తినే పర్మిషన్ వుండేదట!

 

చాలా సార్లు చాలా మంది అభ్యుదయవాదులు, ఉదారవాదులు ఉగ్రవాదానికి మతం లేదు అంటుంటారు.వారి ఉద్దేశం కేవలం ఒక మతం వారు మాత్రమే ఉగ్రవాదులు కాదని! అయితే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సంప్రదాయవాదులు, ఛాందసులు ఉగ్రవాదానికి మతం వుందనీ, అది ఇస్లామని అంటుంటారు. అంటే, వారి ఉద్దేశంలో అత్యధిక శాతం టెర్రరిస్టులు ముస్లిమ్ లేనని! ఈ వాదనల మాటెలా వున్నా.... ఉగ్రవాదానికి మతం వున్నా లేకపోయినా... ఉగ్రవాదులకి ఖచ్చితంగా మతం వుంటుంది. వారు ఏ పని చేసినా మతంతోనే ముడిపెట్టుకుంటారు. దీనికి కేవలం ముస్లిమ్ ఉగ్రవాదులే పరిమితం కాదు. అన్ని మతాల్లోని ఉగ్రవాదులు అంతే. మతం ఆధారంగా అరాచకం సృష్టించటానికి పూనుకున్న వాడు అదే మతాన్ని అన్నిటితో ముడిపెడతాడు. ఇక మత ఛాందసానికి, క్రూరత్వానికి పెట్టింది పేరైన ఐసిస్ సంగతి చెప్పేదేముంది...

 

ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు నర రూపరాక్షసులు. ఇదేదో పోలిక కోసం అంటాం అనుకోకండి. వాళ్లు కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో చేసిన అరాచకాలు అటువంటివి. సిరియా, లిబియా, ఇరాక్ లాంటి చోట్ల తమ స్వాధీనంలో వున్న ప్రాంతాల్లో ఐసిస్ రాక్షసులు చెలరేగిపోయారు. ఎంతగా అంటే, ఇప్పుడు వారి చెర నుంచి విముక్తం అయిన చోట్లలో అప్పటి దుర్మార్గపు సత్యాలు బయటపడుతున్నాయి. లండన్ లోని ఒక సంస్థ వారి చేతికి చిక్కిన ఐసిస్ డాక్యుమెంట్స్ ప్రకారం... అవసరమైతే ముస్లిమేతరుల మంసం కూడా వండుకుని తినొచ్చని వాటిల్లో వుందట. ఇలాంటి దారుణమైన పద్దతుల్లో ఐసిస్ తన జిహాదీలకు శిక్షణ ఇచ్చేదట. అసలు మనిషి మాంసం తినమని చెప్పటమే గగుర్పొడిచే విషయమైతే... వారు ముస్లిమ్ లు కాకూడదని చెప్పటం... మతోన్మాదానికి పరాకాష్ఠ! అణువణువునా ఇతర మతాల పట్ల ఐసిస్ ఉగ్రవాదులకి పేరుకుపోయిన ద్వేషానికి సంకేతం!

 

ఇతర మతాల మనుషుల్ని చంపి వండుకుని తినమని చెప్పిన ఇస్లామిక్ స్టేట్ తమ మతంలోని వార్ని కూడా వదల్లేదు. అతి వాద ఇస్లామ్ ని తిరస్కరించే సాధారణ ముస్లిమ్ లని కూడా చంపొచ్చట. తినొచ్చట. ఇక ఐసిస్ పిల్లల్ని, స్త్రీలని పెట్టిన హింసల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఆ ఒక్క సంస్థ మతోన్మాదం మధ్య ఆసియాలో అనేక ప్రాంతాల్ని వేల ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఐసిస్ కుప్పకూలినా ఆయా దేశాలు, ప్రాంతాలు బాగుపడే అవకాశం కనుచూపు మేరలో , వందల సంవత్సరాల్లో కనిపించటం లేదు!