విశాఖలో రాజధాని వద్దు: భారీ ట్విస్ట్ ఇచ్చిన ఇండియన్ నేవీ

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ కేంద్రంగా ఉన్న మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్‌కు నేవీ తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని లేఖలో పేర్కొంది. విశాఖను ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. మిలీనియం టవర్స్‌లో విభాగాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో నేవీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది.

శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యంగా ఉందని, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో నేవీ అధికారులు తెలిపారు. కాబట్టి దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు సలహా ఇస్తున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది. కాగా.. ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది.

మే నెల తర్వాత విశాఖకు పాలనా రాజధానిని తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు సీఎం జగన్ తాజాగా డిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతోనూ చర్చలు జరిపారు. శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చే నెలలో పార్లమెంటు ఆమోదముద్ర కూడా పడుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖలో రాజధాని నిర్ణయానికి నేవీ అభ్యంతరాలు చెప్పిందన్న వార్తలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. విశాఖ కేంద్రంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు ఉన్నా రాజధాని విషయంలో నేవీ అభ్యంతరాలు చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. అదే నిజమైతే విశాఖలోనే ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా లేక పూర్తిగా విశాఖను వదిలి మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నేవీ రాసిన లేఖపై ప్రభుత్వం నంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు. నేవీ లేఖపై మాట్లాడేందుకు ప్రభుత్వ వర్గాలు కూడా నిరాకరిస్తున్నాయి.