గాలి వారి పెళ్లికి వెళ్లొద్దు..

 

గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలెవరూ ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లరాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అమిత్ షా, స్వయంగా యడ్యూరప్పకు ఫోన్ చేసి చెప్పారని, ఇప్పటికే ఈ పెళ్లికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు వెనక్కు తగ్గవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తరుణంలో, అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వెళితే, వివాదాలు, విమర్శలు చుట్టుముట్టవచ్చని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే నోట్ల రద్దు తరుణంలో ఎంత మంది పెళ్లికి వెళతారో...?వెళ్లరో..? తెలియాలి.