నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

posted on: Nov 28, 2024 8:10AM

ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయనీ, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందనీ పేర్కొంది. అయితే ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో శుక్ర, శనివారాల్లో (నవంబర్ 28, 29) పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఫెంగల్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.  

ఫెంగల్ తుపాను కారణంగా  విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్ 4తో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వైపు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

మత్స్యకారులు   డిసెంబర్ 3 వరకూ సముద్రంపై వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుపాను దూసుకుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  సూచించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలనీ,  ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...