పెళ్ళయిన నెలకి లవర్ తో కూతురు...గొంతు పిసికి చంపబోయిన తండ్రి

 

పెళ్ళయిన నెల రోజులకి భర్తను మోసం చేసి లవర్ తో వెళ్ళిపోయి పరువు తీసిన కూతురిని హతమార్చేందుకు ప్రయత్నించాడో తండ్రి. సంచలనం రేపుతున్న ఈ ఘటనకి సంబందించిన వివరాల్లోకి వెళితే చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి తన రెండో కూతురికి గత నెల 14వ తేదీన పెళ్లి జరిపించాడు. నిజానికి పెళ్లికి ముందు ఆ యువతి వేరే యువకుడిని ప్రేమిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ప్రేమికులు కలుసుకునేవారనే విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో బలవంతంగా పెళ్లి చేశారు. 

నెల రోజుల పాటు అత్తారింట్లోనే ఉన్న యువతి ఈ నెల మొదటి వారంలో పుట్టింటికి వెళ్లి అక్కడి నుంచి ప్రియుడితో పారిపోయింది. దీంతో రెండ్రోజుల పాటు వెతికి కూతురిని పట్టుకున్న తల్లిదండ్రులు పెద్దల వద్ద పంచాయతీ పెట్టి తిరిగి ఆమెను అత్తారింటికి పంపారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఆమె ప్రియుడిని కలుస్తూనే ఉంది. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. 

తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినా ఆమె అతనిని కలవడం మానలేదు. ఈమె వలన పరువు పోతుందని భావించిన తండ్రి కూతురి గొంతు నులిమాడు. గట్టిగా కేకలు వేస్తూ ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె చనిపోయిందని భావించి సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కుమార్తెపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.