ధర్మాన మళ్ళీ డ్యూటీలో జేరారా?

 

తన మంత్రి  పదవికి రాజీనామా చేసిన కారణంగా గత కొన్ని నెలలుగా సచివాలయం వైపు చూడని రెవెన్యూశాఖ మంత్రి థర్మాన ప్రసాదరావు, ఇంతవరకు తగిలిన ఎదురు దెబ్బలకి ఇక నేడోరేపో స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకొంటారని మీడియాలో వార్తలు వస్తున్నతరుణంలో గురువారంనాడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన ఎన్ఏసీ బోర్డు సమావేశంలో పాల్గొనడంతో, ఆయన మళ్ళీ విధులకు హాజరు కాబోతున్నట్లు తెలియజేసినట్లయింది.

 

క్రిందటి నెల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఒక అధికారిక కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నపుడు, మీడియా ప్రశ్నకు బదులిస్తూ తానూ రాజీనామా చేసినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి ఆమోదించనందున ఆ సమావేశంలో పాల్గొన్నానని, అయితే ఇప్పటికీ తానూ తన రాజీనామాకు కట్టుబడే ఉన్నానని తెలిపారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే, ఆయన సచివాలయంలో జరిగిన అధికారిక సమావేశంలో పాల్గొనడంతో, ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని విధులకు హాజరవుతారని భావించవచ్చును. అయితే, మళ్ళీ కోర్టుకు వెళ్ళవలసి వస్తే అప్పుడు ఏమి చేస్తారనేదే ప్రశ్న.