గుడ్ న్యూస్.. రేపటి నుండి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో సిటీ బస్సులు.. 

దాదాపు ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో ఆగిపోయిన సిటీ బస్సులు రేపు మళ్ళీ పూర్తీ స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని డిపోల నుండి రెండు రోజులుగా పరిమిత సంఖ్యలో ఆర్డినరీ బస్సులనే నడిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 135 రూట్లలో డిపోకు 10-12 బస్సుల చొప్పున 229 బస్సులు గత రెండు రోజులుగా తిరిగాయి. ఐతే గ్రేటర్‌ పరిధిలోని బస్సు డిపోల్లో 3,200 సిటీ బస్సులున్నాయి. ఈ బస్సులను శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో నడిపేందుకు చర్యలు వేగవంతం అవుతున్నట్లుగా తెలుస్తోంది. 

 

కరోనా మరియు లాక్ డౌన్ కారణంగా గత మార్చి 19న జిల్లా, సిటీ బస్సులు నిలిపివేసిన సంగతి తెల్సిందే. ఐతే బస్సులు నడుపుకొనేందుకు కేంద్రం అనుమతించడంతో మే 19న జిల్లా సర్వేస్సులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో సిటీ బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు పాటించడం కష్టంగా ఉండటంతో హైదరాబాద్ లో బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఐతే అటు కర్ణాటక ఇటు ఏపీలో కూడా సిటీ బస్సులు స్టార్ట్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం శివారు డిపోల నుండి కొన్ని బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ లో సిటీ బస్సులను ఏ క్షణంలోనైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించినట్లు సమాచారం. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు దీనికి కావలసిన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.