కాంగ్రెస్‌లోనూ చిరంజీవి టిక్కెట్ల బిజినెస్?

 

 

 

పీఆర్పీ స్థాపించిన సమయంలో భారీగా టిక్కెట్లు అమ్ముకున్న చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా తన టిక్కెట్ల బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా? ఈ ప్రశ్నకి అవును అని సమాధానం చెబుతున్నారు సీమాంధ్రకి చెందిన కాంగ్రెస్ నాయకుడు నంబూరు శ్రీను. కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన నంబూరు శ్రీను చిరంజీవి మీద ఈ ఆరోపణలు చేశారు.

 

గతంలో పీఆర్పీ నుంచి టిక్కెట్ ఇస్తానని నమ్మించిన చిరంజీవి హైదరాబాద్‌లో తనకున్న రెండున్నర ఎకరాలనుపార్టీ ఆఫీసు నిర్మాణం కోసం రాయించుకున్నారని నంబూరు శ్రీను ఆరోపిస్తూ ఆ లావాదేవీకి సంబంధించిన దస్తావేజుల కాపీ కూడా చూపించారు. అయితే రెండున్నర ఎకరాలు రాయించుకున్నా తనకు తిరువూరు నుంచి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.



అయితే తన భూమి తనకి ఇవ్వాలని చిరంజీవిని అడిగితే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువూరు టిక్కెట్ ఇస్తానని చెప్పారని, ఇప్పుడు కూడా మోసం చేస్తూ తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. అందుకే తాను తిరువూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా రంగంలోకి దిగానని ఆయన చెప్పారు.  తన భూమి విషయంలో త్వరలో చిరంజీవిని కోర్టుకు లాగనున్నట్టు నంబూరు శ్రీను వెల్లడించారు.