ఈవీఎంల పై అనుమానాలు.. తెలంగాణలో కూడా?

 

ఎన్నికల సంఘం పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి కాబట్టే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాము కోరుతున్నామని అన్నారు. బ్యాలెట్ పేపర్లను లెక్కించడానికి ఒక రోజు సరిపోతుందని.. అలాంటిది వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజులు పడుతుందని ఈసీ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను కేవలం ఏపీ గురించి మాత్రమే మాట్లాడటం లేదని, తెలంగాణలో కూడా పోల్ అయిన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా వచ్చిందని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈసీ తప్పుల గురించి మాట్లాడితే కేసులు పెడతారా? అని మండిపడ్డారు. ఈవీఎంల పనితీరుపై బీబీసీ కూడా అనుమానాలు వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, చాలా దేశాలు మళ్లీ బ్యాలెట్ విధానాన్నే అమలు చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.