సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక

 

మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 13న మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈనెల 20న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 30 వరకు గడువు ఇస్తారు. మొత్తమ్మీద మెదక్ లోక్ సభ స్థానానికి సెప్టెంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. 16న కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతూ, మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అందువల్ల ఇప్పుడీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. మెదక్ లోక్ సభ స్థానంతోపాటు దేశంలోని 9 రాష్ర్టాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.