'బీఎస్ఎన్ఎల్'కు బిల్లు ఎగ్గొట్టిన వరుణ్ గాంధీ
posted on Apr 10, 2019 6:05PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ.. ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని నామినేషన్ పత్రాలకు జతపర్చాలన్న విషయం తెలిసిందే. ఒక వేళ అభ్యర్థి ఈ నియమాలు పాటించకపోతే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి అలాంటి తలనొప్పే వచ్చి పడింది. వరుణ్ గాంధీ తమకు రూ.38,616ల బిల్ ఎగ్గొట్టాడని బీఎస్ఎన్ఎల్ ఆరోపించింది. తమ సంస్థకు బిల్లు చెల్లించకుండా.. ఫిలిబిత్ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు చేసింది. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు సంబంధిన ఫోన్ బిల్లు రూ. 38,616 కట్టలేదని ఫిర్యాదులో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.