కమలం వైపే జనాభిప్రాయం

 

 

 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ హవా ఉంటుందని.. ఆ పార్టీ అత్యధికంగా 195 సీట్లు గెలుచుకుంటుందని తమ తాజా ఎన్నికల సర్వేలో వెల్లడయిందని ఎన్‌డీటీవీ తెలిపింది. హంసా రీసెర్చ్ గ్రూప్‌తో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం.. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 229 సీట్లు లభిస్తాయని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీకి 43 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ఇక అధికార యూపీఏ సారథి కాంగ్రెస్ పార్టీ బలం సగానికి సగం పడిపోయి 106 సీట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. యూపీఏకు మొత్తంగా 129 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే చెప్తున్నట్లు వెల్లడించింది. వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమికి కేవలం 55 సీట్లు వస్తే, ఇతర పార్టీలన్నిటికీ కలిపి 130 సీట్లు వస్తాయని పేర్కొంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 350 నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా ప్రజలను సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వివరించింది.