కమలం - సైకిల్ దోస్తీ?

 

రానున్న ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్రంలోని కమలనాథులు ఎంతగా ఉత్సాహపడుతున్నా, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక కొన్ని లాంఛనాలు కూడా పూర్తి చేసుకున్నాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినపుడు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. స్థానిక, సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణల్లో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ ప్రధాన శత్రువులన్నారు. భవిష్యత్ అవసరాలు, జాతీయరాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. సాధారణ ఎన్నికలు పార్టీకి ముఖ్యం కాబట్టి బీజేపీ ఎన్ని స్థానాలు కోరితే అన్ని ఇవ్వాలన్నారు.