అసెంబ్లీ సీట్లు పెంచరట

 

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు వున్నాయన్న వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆసక్తిగా వుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అసెంబ్లీ స్థానాలను పెంచడం 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం 2026వ సంవత్సరం వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్‌ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయంలో తమ పోరాటాన్ని ఆపేదే లేదని ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు.