చిరుకి ఆ మాత్రం తెలియదా?.. వాళ్ల సినిమాలు చూడకండి: అశ్వనీదత్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను సినీ హీరో చిరంజీవి స్వాగతించడాన్ని నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని.. అయినా సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరంజీవికి తెలియదా అని అశ్వనీదత్ చురకలంటించారు. రాజధాని ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని.. నటుడిగా కాకున్నా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అని ఒక స్టార్ హీరోని ఉద్దేశించి అశ్వనీదత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాళ్ల సినిమాలు చూడటం మానేయండని, వాళ్లే దిగివస్తారని రాజధాని రైతులకు అశ్వనీదత్ పిలుపునిచ్చారు.