ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి! రాష్ట్రపతి, ప్రధానికి వినతులు 

అరాచక పరిస్థితులు నెలకొన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు ఫిర్యాదులు వెళ్లాయి. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు వెళ్లి ఈ ఫిర్యాదులను అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అందులో ఆయన వివరించారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని  బీవీ రామ్ చెప్పారు. ఒకవేళ కేంద్రం  తగిన విధంగా స్పందించకపోతే  జై ఆంధ్ర ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రామ్ డిమాండ్ చేశారు.  

విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని, వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని రామ్ ఆరోపించారు. ఎంపీ  విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, గండిగుండంలో స్థానిక నాయకుడు శ్రీనివాసరావు ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం చంపుతామని వైసీపీ నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు రామ్.  ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని తన ఫిర్యాదులో  రామ్ వివరించారు. ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.