జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు.. సభ వాయిదా..

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం నాడు వాడిగా, వేడిగా జరిగాయి. శాంతి భద్రతల మీద చర్చ జరగాలని ప్రతిపక్ష వైసీపీ పట్టుబట్టడంతో స్పీకర్ అందుకు అనుమతి ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తల మరణాలను తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ జగన్ తదితర వైసీపీ నాయకులు మాట్లాడ్డం పట్ల తెలుగుదేశం శాసనసభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో రక్తచరిత్ర వున్న నాయకుడు, ఫ్యాక్షనిస్టు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలుగుదేశం సభ్యులు గళమెత్తారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో నరమేధం జరిగిందని, వందలమంది తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘బఫూన్లు’ అని వ్యాఖ్యానించడంతో గొడవ తారస్థాయికి చేరింది. దాంతో స్పీకర్ కోడెల సభను శనివారం నాటికి వాయిదా వేశారు. అలాగే జగన్ చేసిన ‘బఫూన్’ అనే వ్యాఖ్యను స్పీకర్ కోడెల తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలుగుదేశం సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ తన వ్యాఖ్యని ఉపసంహరించుకోలేదు. దీనిపై తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.