ఎస్పీలో మరో హైడ్రామా.... చంపుతానని బెదిరిస్తున్నారు..

 

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సమాజ్ వాదీ పార్టీలో రోజుకో డ్రామా తెరపైకి వస్తుంది. నిన్న మొన్నటి వరకూ పార్టీ అధినేత ములాయం, కొడుకు అఖిలేశ్ మధ్య రాజకీయ పోరు నడవగా.. ఇప్పుడు తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఈసారి రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ హైడ్రామా మొదలుపెట్టాడు. తనను చంపేస్తామంటూ అఖిలేష్‌ బాబాయ్..కీలక నేత రాంగోపాల్‌ యాదవ్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. వారణాసిలో మాట్లాడుతూ.. తనను చంపేస్తానంటూ రాంగోపాల్‌ యాదవ్‌ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దీంతో తన జీవితమే ప్రమాదంలో పడిందన్నారు.‘రాంగోపాల్‌ నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను చంపేస్తానంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ములాయం సింగ్‌ తనను సోదరుడిగా భావిస్తున్నందు వల్లే.. అమర్‌ యూపీకి వచ్చి క్షేమంగా తిరిగివెళుతున్నారని రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు’ అని అమర్‌సింగ్‌ మీడియాకు వివరించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను మాత్రం ములాయంతోనే నిలుస్తానని స్పష్టంచేశారు. మరి ఈ కథ ఎంత దూరం వెళుతుందో..మళ్లీ  ఏ డ్రామాతో ముందుకొస్తారో చూద్దాం..