రామ్ చరణ్ విమానాలు వచ్చేస్తున్నాయి

 

‘ట్రూ జెట్’ పేరుతో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్‌గా టర్బో మేఘ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సేవలు జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నామని, జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందని టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఉత్తరాదీన అహ్మదాబాద్, పుణే, గోవాలలో కూడా ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను కూడా టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఇప్పుడు ప్రారంభించనుంది. ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించాలని కోరుతున్నామని ఉమేశ్ అన్నారు.