తుంగభద్ర నీటి వివాదం.. వైసీపీ నేతల గృహ నిర్భంధం..
posted on Nov 19, 2016 10:15AM
తుంగభద్ర ఆయకట్టు భూములకు నీటిని తక్షణం వదలాలని వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పలువురు వైసీపీ నేతలను గృహ నిర్భంధం చేశారు పోలీసులు. అనంతపురంలో వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టగా.. వైకాపా నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతేకాదు వారికి వేలాది మంది కార్యకర్తలు, రైతులు మద్దతు పలికారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా నేతలు ర్యాలీ జరపకుండా, ఎలాంటి నిరసనలు తెలియజేయకుండా చూసేందుకు పలువురిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. వైకాపాకు మద్దతు తెలిపిన సీపీఎం, సీపీఐ నేతలను సైతం ఇల్లు కదలనివ్వకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అడిగిన పాపానికి ఇలా ఇళ్ల నుంచి బయటకు కదలనీయకపోవడం దుర్మార్గమని ఆరోపించారు.