మీసేవ చుట్టూ పరుగో పరుగు

 

 

 

స్థానిక సంస్థల అభ్యర్థులను ఆయా పార్టీలు ఆఖరి నిమిషంలో ప్రకటిస్తుండటంతో రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే సంబంధిత అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక పోవటంతో అభ్యర్థుల స్థానంలో కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఖరి నిమిషంలోనైనా అవకాశం వస్తే పోటీ చేసేందుకు కొందరు ఆశావహులు కులధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రిజర్వేషన్ల కారణంగా దొరక్కదొరక్క దొరికిన అభ్యర్థి కులధ్రువీకరణ ప్రతం తేవడం కష్టంగా మారింది. పంచాయతీ ఇంటి, నీటి పన్నుల బకాయిల చెల్లింపుల నోడ్యూస్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చాలా పంచాయతీలలో కార్యదర్శుల కొరత ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. ఎన్నికల నిబంధనలు తెలియని గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది.