మన దేశంలో కూడా తెలుగువారికి తప్పని కష్టాలు...
posted on Mar 25, 2017 10:59AM
ఒక పక్క జాత్యహంకారంతో అమెరికాలో తెలుగువారిపై దాడులు జరుగుతుంటే ఇప్పుడు మన దేశంలో కూడా తెలుగువారికి రక్షణ లేదని ఈ ఘటన చూస్తుంటే అర్ధమవుతోంది. బ్రతుకుదెరువు కోసం వెళ్లిన ఏపీ కూలీలపై దాడి జరిపి తమ పైశాచికాన్ని ప్రదర్శించారు మహారాష్ట్ర వాసులు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వందలాదిమంది కూలీలు జీవనాధారం కోసం మహారాష్ట్ర వెళ్లారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీల వల్ల తమకు ఉపాధి లేకుండా పోతోందని అక్కడి స్థానికులు కొంతమంది కూలీలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తరువాత కొద్ది సేపటికి మళ్లీ వచ్చి మరోమారు దాడి చేశారు. అంతేకాదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. వారి దాడిలో పదిమందికిపైగా ఏపీ కూలీలు గాయపడ్డారు. అయితే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. కానీ వారు కేసు నమోదు చేసుకోవడానికి వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.