'ఆహా'కు కాదు... 'జీ5'కు మరో మెగా డాటర్ వెబ్ సిరీస్!
on Jul 23, 2021
అల్లు అరవింద్ భాగస్వామిగా అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ ఆహా మొదలైంది. అల్లు అరవింద్ తనయుడు, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అల్లు, కొణిదెల కుటుంబాలకు చెందిన మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ 'ఆహా' కోసం పని చేసే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు ఆశించారు. కానీ, వాస్తవం వేరుగా ఉంది. ఆహా కోసం కాకుండా మరో ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ జీ కోసం మెగా డాటర్స్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు'తో నిర్మాతగా మారారు. ఆ వెబ్ సిరీస్ను 'జీ 5'కు ఇచ్చారు. ఇప్పుడు మరో మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారికా కొణిదెల ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇదీ 'జీ 5' కోసమే.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించిన నిహారిక గతంలో వెబ్ సిరీస్ లు నిర్మించారు అందులో రెండు 'ముద్దపప్పు ఆవకాయ్', 'మ్యాడ్ హౌస్' యూట్యూబ్లో విడుదలైతే... మరొకటి 'నాన్న కూచి' జీ5లో విడుదలైంది. ఇప్పుడీ కొత్త వెబ్ సిరీస్నూ 'జీ 5' కోసం నిర్మిస్తున్నారు. #OCFS టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. గురువారం ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.