అనాథలా వదిలేశారు.. డబ్బుల కోసం స్టేజ్ షోలు చేశా!
on May 8, 2021
'హిట్లర్ గారి పెళ్లాం', 'దేవత' వంటి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి మధు కృష్ణ. 'భలే భలే మగాడివోయ్', 'సరైనోడు' వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది. దాదాపు 1300కి పైగా స్టేజ్ షోలు చేసిన యాంకర్ గా కూడా సత్తా చాటిన ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అవుతుంది. పదేళ్ల వయసులోనే తన తండ్రి చనిపోయాడని, అప్పటికి తన తల్లి వయసు పాతికేళ్లు కావడంతో తనను విడిచి పేరెంట్స్ తో వెళ్లిపోయిందని చెప్పింది.
దీంతో అనాథలా మారిన మధుకృష్ణను తాతయ్య, నాన్నమ్మలు పెంచారట. కొన్నాళ్లకు వాళ్లు కూడా చనిపోవడంతో ఒంటరిగా బతకాల్సి వచ్చిందని.. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అంటూ తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తాతయ్య, నానమ్మ, చుట్టుపక్కల వారి సహాయంతో డిప్లొమా వరకు చదువుకున్నానని చెప్పిన మధుకృష్ణ.. డబ్బుల కోసం స్టేజ్ షోలు మొదలుపెట్టానని గుర్తు చేసుకుంది. భయం, బాధ రెండూ వెంటాడేవని.. చదువు మధ్యలో ఆపకూడదనే ఆలోచనతో స్టేజ్ షోలు చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.
లోపల బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉండేదాన్ని అని.. మెల్లగా యాంకరింగ్ మొదలుపెట్టి.. తొమ్మిదేళ్లలో 1300కి పైగా స్టేజ్ షోలు చేశానని తెలిపింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని.. కాలేజ్ కు వెళ్తూనే స్టేజ్ షోలు, ఈవెంట్స్ చేశానని.. అలానే బీటెక్ పూర్తి చేశానని చెప్పింది. ఎంటెక్ కూడా మొదలుపెట్టానని కానీ మధ్యలోనే మానేశానని అంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నా.. ఒంటరి అని బాధ పడకుండా.. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగానంటూ తన గతాన్ని చెప్పుకొచ్చింది.