2019 టాలీవుడ్ రివ్యూ: 'హీరోయిన్' విలువ పెరిగింది
on Dec 31, 2019
తెలుగు సినిమా పుట్టుక దగ్గర్నుంచే లేడీ ఓరియెంటెడ్ మూవీస్కు కొదవలేదు. కమర్షియల్ మూవీస్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ద్వారా, హీరో ప్రధాన సినిమాల్లోనూ మంచి పాత్రల ద్వారా తమ సత్తాను చాటిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. 2019లోనూ అలాంటి సినిమాలూ, అలాంటి పాత్రలూ ఎన్నో మన ముందుకు వచ్చాయి.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఉన్న సమంత.. నాగచైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్కు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. అవి ఎక్స్పెక్ట్ చేసిన రేంజిలో కమర్షియల్ సక్సెస్ను అందుకోకపోయినా, ఆ లోటును ఈ సంవత్సరం వచ్చిన 'ఓ బేబీ' మూవీ తీర్చేసింది. విశేషం ఏమంటే.. ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలింను డైరెక్ట్ చేసింది మరో లేడీయే. ఆమె.. నందినీరెడ్డి. ఈ సినిమాలో నాగశౌర్య వంటి యంగ్ యాక్టర్స్, రావు రమేశ్ వంటి ఎక్స్పీరియెన్స్డ్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఇటు సమంత, అటు లక్ష్మి.. ఇద్దరూ సినిమా అంతా తామే అయ్యి నడిపించారు.
మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన 'సీత' సినిమానీ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే. డైరెక్టర్ తేజ రూపొందించిన ఈ సినిమా నటిగా కాజల్ను మరో లెవల్కి తీసుకెళ్లింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపవడం వేరే సంగతి. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్.. రెండింటిలోనూ పాపులర్ అయిన తాప్సీ సైతం 2019లో ద్విభాషా చిత్రం 'గేమ్ ఓవర్'లో నటించింది. హిందీలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడిప్పుడే సౌత్లోనూ అలాంటి స్టోరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలా వచ్చిందే 'గేమ్ ఓవర్'.
ఇక 2019లో వచ్చిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'కౌసల్య కృష్ణమూర్తి'. ఒకప్పటి హీరో.. స్వర్గీయ రాజేశ్ కుమార్తె, ఇప్పటికే తమిళనాట డిమాండ్ ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య ఈ సినిమాతోటే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఓ పల్లెటూరి అమ్మాయి క్రికెట్లో రాణించడానికి ఎలాంటి అవస్థలు పడిందన్నదే ఈ సినిమా స్టోరీ. మరో విశేషం ఏమంటే.. ఇందులో రైతుల సమస్యను ఎఫెక్టివ్గా చూపించాడు డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు. అలాగే ఐశ్వర్య నటించిన మరో మూవీ 'మిస్ మ్యాచ్' కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మే. ఇందులో రెజ్లర్.. అంటే మల్లయోధురాలి రోల్లో ఐశ్వర్య అభినయాన్ని క్రిటిక్స్ మెచ్చారు.
కర్షియల్ సక్సెస్ అందుకున్న 'ఎవరు' కూడా చెప్పుకోవాల్సిన సినిమానే. ఈ మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ మూవీలో రెజీనా కసాండ్రా పోషించిన క్యారెక్టర్ అందరి ప్రశంసలూ పొందింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ను అద్భుతంగా చేసింది రెజీనా. అలానే తొలి సినిమాతోటే మంచి పేరు తెచ్చుకుంది జీవిత, రాజశేఖర్ దంపతుల గారాలపట్టి శివాత్మిక. 'దొరసాని' సినిమాలో శివాత్మిక టైటిల్ రోల్ పోషించింది. కథంతా ఆమె చుట్టూనే తిరగడం కారణంగా దీన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీగానే భావించాలి. ఇక నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక 'సూర్యకాంతం' సినిమాతో మెగాఫ్యాన్స్ను మరోసారి ఆకట్టుకుంది. 2018లో 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అలరించిన అనసూయ ఈసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ 'కథనం'తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.
2018లో 'ఆర్ఎక్స్ 100' మూవీతో అందాలు ఆరబోసిన నూతన నాయిక పాయల్ రాజ్పుత్ ఇప్పుడు 'ఆర్డిఎక్స్ లవ్' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. అయితే శ్రుతి మించిన సీన్ల కారణంగా ఈ సినిమాను జనం ఆదరించలేదు. విశేషం ఏమంటే.. 2019లో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో కొన్ని హారర్ జానర్వీ ఉన్నాయి. అలాంటిదే 'జెస్సీ' సినిమా. అదే కోవకు చెందిన మరో మూవీ నందితారాజ్ ప్రధాన పాత్ర పోషించిన 'విశ్వామిత్ర'. అలానే పాపులర్ టీవీ యాంకర్ రష్మీ గౌతం నటించిన 'శివరంజని', అవికా గోర్ కీలక క్యారెక్టర్ చేసిన 'రాజుగారి గది 3', లక్ష్మీరాయ్ సినిమా 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి', తెలుగమ్మాయి ఈషా రెబ్బ నటించిన 'రాగల 24 గంటల్లో' హారర్ అండ్ థ్రిల్లర్ జానర్కు చెందిన సినిమాలు. ఇలా పలు సినిమాల్లో హీరోయిన్లకు ప్రధాన పాత్రలు లభించడం, వాటిని తమ అభినయంగా చక్కగా పోషించి పేరు తెచ్చుకోవడం టాలీవుడ్లో గుర్తించాల్సిన అంశం.
స్ట్రెయిట్ తెలుగు సినిమాలే కాదు, పలు లేడీ ఓరియెంటెడ్ డబ్బింగ్ సినిమాలూ రావడం 2019కి చెందిన విశేషం. అందులో చెప్పుకోవాల్సింది నయనతార సినిమాలను. ఆమె నటించిన మలయాళ చిత్రం 'లేడీ టైగర్' పేరుతో రాగా, తమిళ సినిమా ఒకటి 'అంజలి సీబీఐ'గా మన ముందుకు వచ్చింది. ఇక హారర్ మూవీ 'ఐరా'లో అయితే నయనతార ఏకంగా ద్విపాత్రాభినయం చేసింది. ఆ తర్వాత స్థానంలో లక్ష్మీరాయ్ నిలుస్తుంది. ఎందుకుంటే స్ట్రెయిట్ తెలుగు సినిమా 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'లో నటించిన లక్ష్మీరాయ్ తమిళ డబ్బింగ్ సినిమాలు 'నాగకన్య', 'సంజనరెడ్డి'లోనూ కీలక పాత్రలు పోషించింది. మిల్కీ బ్యూటీ తమన్నా అయితే 'అభినేత్రి 2'తో జనం ముందుకు వచ్చి, వినోదాల విందు పంచడంతో పాటు కాస్తంత భయపెట్టింది.
అలానే 'తారామణి' లో ఆడ్రియా జెర్మియాతో కలిసి మెప్పించిన తెలుగమ్మాయి అంజలి, 3డి సినిమా 'లిసా'తో ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. మరో తమిళ స్టార్ హీరోయిన్ అమలా పాల్ 'ఆమె' మూవీలో నగ్నంగా నటించి, సంచలనం సృష్టించింది. మరో విశేషం ఏమంటే.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్కు పెట్టింది పేరైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సైతం 2019 మొదట్లోనే 'మణికర్ణిక' పేరుతో ఝాన్సీ లక్షీబాయ్ కథను వెండితెరకెక్కించి గుర్తింపు పొందింది.