రానా కోసం సాయిపల్లవి నిరీక్షణ
on May 14, 2020
'విరాటపర్వం'లో సాయిపల్లవి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. అందులో ఎవరో కోసమో నిరీక్షిస్తున్నట్టు ఉన్న ఆమె చూపు సినిమాపై అంచనాలు పెంచింది. రానా కోసమే ఆమె నిరీక్షణ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టుల నేపథ్యంలో 90వ దశకంలో జరిగిన ఉద్యమ స్పూర్తితో అప్పటికి కాలాన్ని తలపించే విధంగా దర్శకుడు వేణు ఊడుగుల 'విరాటపర్వం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రానా, సాయి పల్లవి మావోయిస్టులుగా కనిపిస్తారని వినికిడి. సాయి పల్లవి దళంలో చేరడం వెనుక కథ, రానాతో ప్రేమలో పడే విధానం ఆసక్తికరంగా ఉంటుందట.
సాయి పల్లవి ఒక పల్లెటూరి అమ్మాయి. ఆమె ఊరిలో పోలీసులకు, రానా దళానికి మధ్య భీకర పోరు జరిగినప్పుడు అతడిని చూస్తుంది. తర్వాత రానా గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కరపత్రికల ద్వారా అతడి ఐడియాలజీ తెలుసుకొని, అతడితో ప్రేమలో పడుతుంది. అతడి దళంలో చేరుతుందనీ, ఇదీ 'విరాటపర్వం'లో వీరిద్దరి కథ అని కృష్ణానగర్ ఖబర్. ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, సాయి చంద్, ఈశ్వరి రావు, జరీమా వాహెబ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.