స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి
on May 14, 2020
ఇటీవల సోషల్ మీడియాను 'బాయ్స్ లాకర్ రూమ్' ఘటన షేక్ చేసింది. ఢిల్లీలో స్కూల్స్కి వెళ్లే కొందరు టీనేజ్ పిల్లలు కలిసి ఇన్స్టాగ్రామ్లో సీక్రెట్ చాట్ రూమ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక అమ్మాయి ఫొటోను షేర్ చేసి, రేప్ చేయాలని చాటింగ్ చేసుకున్నారు. సీక్రెట్గా చేసుకున్న చాటింగ్ను ఎవరో స్క్రీన్షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వ్యవహారం బట్టబయలు అయింది. స్త్రీ పురుష బేధం లేకుండా అబ్బాయిలు చేసిన తప్పుడు పనిని పలువురు ఖండించారు. 'బాయ్స్ లాకర్ రూమ్' ఘటనపై కథానాయిక కృతి సనన్ సైతం స్పందించారు. ఇటువంటి ఘటనలు తగ్గాలంటే స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
"బాయ్స్ లాకర్ రూమ్ ఘటన గురించి తెలియగానే చదవడానికి కూడా అసహ్యం వేసింది. అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు మాట్లాడుకుంటారని అందరికీ తెలుసు. అమ్మాయి అందంగా కనిపిస్తుందని, సెక్సీగా ఉందని పొగడడం వరకు ఓకే. ఆ హద్దులు దాటి క్యాజువల్గా రేప్ గురించి మాట్లాడడం షాకింగ్గా ఉంది" అని కృతి సనన్ అన్నారు. సమాజంలో ఈ ధోరణి ఎప్పుడు మారుతుందని అనిపించిందనీ, సమాజంలో మార్పు రావాలంటే మైండ్ సెట్ మారాలని ఆమె అన్నారు. ముఖ్యంగా అబ్బాయిలను పెంచే విధానం మారి తీరాలని కృతి సనన్ స్పష్టం చేశారు.
"పిల్లల పెంపకం ఒకటి అయితే... అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ అన్నట్టు చూసే ధోరణి మరొకటి. అమ్మాయిలను గౌరవించే లక్షణం అబ్బాయికి నేర్పాలి. అమ్మాయిని డాన్స్ కి, అబ్బాయిని బాక్సింగ్ కి పంపిస్తారు. ఎందుకు? అమ్మాయిలు ఈ పనులు మాత్రమే చేయాలని గిరి గీస్తారు. అమ్మాయిలు, అబ్బాయిల్ని వేర్వేరుగా చూడడం తల్లిదండ్రులు మానేయాలి. మహిళలే మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. ఇద్దరినీ సమానంగా చూడాలి. ఎర్లీ ఏజ్ లో, స్కూల్ లో సెక్స్ ఎడ్యుకేషన్ రావాలి. అమ్మాయిలను అబ్బాయిలు గౌరవించాలి" అని కృతి సనన్ అన్నారు.
బాయ్స్ లాకర్ రూమ్ ఘటనపై కొంతమంది మహిళలు "రేప్ చేయలేదు కదా" అని స్పందించడంపై కృతి సనన్ మండిపడ్డారు. రేప్ చేసే వరకూ ఎదురుచూస్తారా? అని వాళ్ళను ప్రశ్నించారు. రేప్ చేయాలనే ఆలోచనల నుండి అఘాయితలు మొదలవుతాయని, అలా మాట్లాడడం కొందరు మహిళలకు పర్వాలేదన్నట్టు ఉందని కృతి సనన్ ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు.