విజయ్ మాటకు హర్టయిన రాశీ!
on Feb 10, 2020
"ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను హర్ట్ అయ్యాను. అతన్ని లవ్ స్టోరీల్లో చూడ్డం నాకిష్టం. అతను లవర్ పోస్టర్ బాయ్. తన ఫ్యాన్స్ను అతను హర్ట్ చేశాడు" అంటోంది రాశీ ఖన్నా. ఇప్పటిదాకా ఎక్కువ గ్లామరస్ రోల్స్లోనే కనిపిస్తూ వచ్చిన ఆమె, తన కెరీర్లోనే తొలిసారి ఒక బోల్డ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో కనిపించబోతోంది. ఇందులో యామిని అనే పాత్రను ఆమె పోషించింది. హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు లిప్ లాక్స్, లవ్ మేకింగ్స్ సీన్స్ కూడా ఉన్నాయి. టీజర్లో ఈ కోణంలోనే ఆమె క్యారెక్టర్ను ఎలివేట్ చేయడంతో 'ఈ క్యారెక్టర్ చెయ్యడం నీకు అవసరమా?'అని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించారు కూడా. అయితే సినిమా చూశాక వాళ్ల అభిప్రాయం మారుతుందనీ, యామిని పాత్రను వాళ్లు ప్రేమిస్తారనీ అంటోంది రాశీ.
'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, "ఇప్పుడు నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమూ, ప్రేమలో లేనివాళ్ల కోసమూ కూడా. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. కథల్లో, సినిమాల్లో, పద్యాల్లో ఈ ఎమోషన్ గురించి వర్ణించారు. ఎన్నిసార్లు వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. మన తరానికి చాలా ఇష్టం. ఈ సినిమా మిమ్మల్ని అసంతృప్తికి గురిచెయ్యదు. గౌతమ్ (విజయ్ చేసిన రోల్)తో, యామినితో రిలేట్ అవుతారు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. నాకు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను. విజయ్ను ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూస్తారు. ఈ తరానికి అతను ఇన్స్పిరేషన్. అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా" అని ఆమె చెప్పింది.
తాను లవ్ స్టోరీస్లో నటించడానికి ఇష్టపడతానని స్పష్టం చేసిన ఆమె, విజయ్ దేవరకొండను లవ్ స్టోరీస్ కంటిన్యూ చెయ్యమని కూడా కోరింది. మరి ఆమె మాటను విజయ్ మన్నిస్తాడో, లేక మాస్ స్టార్గా ఎస్టాబ్లిష్ కావడానికే మొగ్గు చూపుతాడో చూడాలి.