డియర్ కామ్రేడ్... మైత్రీలో మరొకటి!
on Oct 29, 2018
మహేష్బాబుతో 'శ్రీమంతుడు', జూనియర్ ఎన్టీఆర్తో 'జనతా గ్యారేజ్', రామ్చరణ్తో 'రంగస్థలం'... మూడు ఘన విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పెద్ద పేరు తెచ్చుకుంది. త్వరలో విడుదల కానున్న నాగచైతన్య 'సవ్యసాచి', ఆ తరవాత విడుదల కానున్న రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'డియర్ కామ్రేడ్', సాయిధరమ్ తేజ్ హీరోగా 'చిత్రలహరి' చిత్రాలు నిర్మిస్తోంది. ఇప్పటివరకూ మైత్రీ సంస్థలో ఒక హీరో రెండోసారి నటించలేదు. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకతంలో ఒక రీమేక్ సినిమా ప్రారంభించినా మధ్యలో ఆపేశారు. అసలు ఆ సినిమా వివరాలు ఎప్పుడూ బయటకు ప్రకటించలేదు. తొలిసారి మైత్రీలో ఒక హీరోతో రెండో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదీ ఒక సినిమా సెట్స్ మీద వుండగా రెండో సినిమా పనులు మొదలు పెట్టారు.
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ సంస్థలో 'డియర్ కామ్రేడ్' తెరకెక్కుతోంది. దీని తరవాత మైత్రీలో మరో సినిమా చేయనున్నట్టు విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాకపోతే.. దర్శకుడు ఎవరు? కథ ఎవరిది? వంటి విషయాలు ప్రకటించలేదు. 'నెక్స్ట్ ఇయర్ మరో సినిమా దించుతాం' అని 'సవ్యసాచి' ఫంక్షన్లో విజయ్ దేవరకొండ ప్రకటించాడు.