కరోనాతో ప్రముఖ గేయరచయిత అదృష్ట దీపక్ కన్నుమూత
on May 16, 2021
అభ్యుదయ కవిగా పేరుపొంది, తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టి పలు సామాజిక స్పృహ ఉన్న పాటలను రాసిన అదృష్ట దీపక్ ఇక లేరు. కరోనాతో పోరాడుతో కాకినాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆదివారం ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. 1980లో 'యువతరం కదిలింది' చిత్రంలోని "ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో" పాట ఆయన తొలి సినీ గీతం. ఆయన రాసింది 40 పాటలే అయినా దాదాపు అన్నీ ఆయనకు పేరు తెచ్చినవే.
తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ముఖద్వారంగా పేర్కొనే రావులపాలెంలో 1950 జనవరి 18న జన్మించిన సత్తి అదృష్ట దీపక్ కథకుడు, బుర్రకథారచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, నటుడు, గాయకుడు, సినీ గేయరచయిత. తన సినీపాటల సంపుటి 'ఆశయాల పందిరిలో' మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చారు. కమ్యూనిస్ట్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన 'కోకిలమ్మ పదాలు', 'అగ్ని', 'ప్రాణం', 'అడవి' అనే కవితా సంపుటాలు, 'సమరశంఖం' బుర్రకథ, 'దీపకరాగం' అనే సాహిత్య వ్యాసాల సంపుటి ప్రచురించారు.
"అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు" (ఎర్రమల్లెలు), "ఎన్నాళ్లు ఎన్నేళ్లు ఈ పాట్లు పడతావు" (విప్లవశంఖం), "మంటలు మంటలు మంటలు" (నవోదయం), "తొలికోడి కూసింది తొడగొట్టి నిలవరా" (తొలికోడి కూసింది), "మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం" (నేటి భారతం), "కదంతొక్కి కదులుతోంది కంచుకాగడా" (కంచు కాగడా), "దేశంలో దొంగలుపడ్డారు వీళ్ల తస్సాదియ్యా" (దేశంలో దొంగలుపడ్డారు), "ఏదయా మీదయా మామీద లేదు" (వందేమాతరం), "తూర్పు దిక్కుకే ఈ పయనం" (అర్ధరాత్రి స్వతంత్రం), "ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతమూ" (సగటు మనిషి), "కాదు కాదంటావ దొరను కాదంటావ" (ఎర్రమందారం), "జాగోరే జంభాయిరే జంబలకిడి పంబరే" (ఎర్రోడు) లాంటి గొప్ప అభ్యుదయ గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి.
మాదాల రంగారావు 'యువతరం కదిలింది' చిత్రంతో మద్రాసులో ప్రారంభమైన అదృష్ట దీపక్ సినీ సాహితీ ప్రస్థానం, రంగారావు కుమారుడు మాదాల రవి నటించి, నిర్మించిన 'నేను సైతం' (2004) చిత్రంలోని "వేదన ఎందుకు? మనిసైనందుకు!" పాటతో ముగిసింది. కార్మికులంతా ఎర్రజెండాలు చేతపట్టుకొని సుత్తీ, కొడవలి నృత్యాలతో ఊరేగింపుగా సాగుతూ పాడే "అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు" (ఎర్రమల్లెలు) పాట నేటికీ మే డే నాడు తెలుగు రాష్ట్రాలలోని ఎర్రపందిళ్లలో మారుమోగుతూ ఉంటుంది.
అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో విశ్రాంత జీవితం గడుపుతూ కొవిడ్ బారినపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం విచారకరం.
Also Read