సూపర్ స్టార్లిద్దరూ.. అలా బాయ్ కాట్ చేశారు!
on Aug 29, 2017
సూపర్ స్టార్లిద్దరూ.. అలా బాయ్ కాట్ చేశారు! ( జమ్మున పుట్టినరోజు స్పెషల్)
ఇది 1958 నాటి ముచ్చట. ‘భూకైలాస్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ చిత్రీకరణ తమిళనాడు రామేశ్వరంలో ప్లాన్ చేశారు దర్శకుడు కె.శంకర్. ఉదయం సూర్యోదయ సమయంలో సీన్. ఎన్టీయార్, ఏఎన్నార్, జమున, బి.సరోజాదేవి, నాగభూషణం పాత్రధారులు. రెండ్రోజులు ముందే.. అందరికీ కబురెళ్లిపోయింది. తెల్లవారేసరికి యూనిట్ మొత్తం రామేశ్వరం సముద్ర వడ్డున ఉండాలి. అయితే... ముందు రోజు చిన్న డిస్ట్రబెన్స్. వ్యక్తిగత కారణాల వల్ల బి.సరోజాదేవి షూటింగ్ కి రావడంలేదన్న వార్త. దాంతో... షూటింగ్ కేన్సిల్. మళ్లీ సాయంత్రానికి బి.సరోజాదేవి నుంచి ఫోన్. నేనొస్తున్నాను అని. దాంతో దర్శక, నిర్మాతలు... టకాటకా ముందస్తు పనులన్నింటినీ పూర్తి చేసేసుకున్నారు. అందరికీ కబుర్లెళ్లిపోయాయ్. అయితే... కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జమునకు కబురు ఆలస్యంగా వెళ్లింది. ఈ విషయం యూనిట్లో ఎవరికీ తెలీదు. ఉదయం మూడు గంటలకే యూనిట్ మొత్తం రామేశ్వరం సముద్ర తీరం చేరుకుంది. ఎన్టీయార్, ఏఎన్నార్లతో సహా. జమునే రాలేదు.
నిదానంగా తూర్పు దిక్కు ఎర్రబారుతోంది. జమున రాలేదు. అందరిలో ఒకటే టెన్షన్. బాలభానుడు ఉదయించేస్తున్నాడు. జమున రాలేదు. సూర్యోదయం పూర్తయింది. సముద్ర తీరం వేడెక్కుతోంది. ఇసుకతెన్నెలు వేడితో బుస కొడుతున్నాయ్. అసలే వేసవి. దాంతో... అందరూ చెట్లకిందకు చేరారు. అయినా.. జమున రాలేదు. చివరకు ఉదయం 9గంటలకు మండోదరి గెటప్ తో జమున లొకేషన్లో అడుగుపెట్టారు. ఆ టైమ్ లో ఎన్టీయార్, ఏఎన్నార్ దూరంగా ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అందర్నీ ‘హాయ్’ అని విష్ చేశారు జమున. కానీ ఎవరికీ ‘సారీ’ అని కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు తేలిగ్గానే తీసుకున్నా.. ఎన్టీయార్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.
సమయం ఎలాగూ వృధా అయ్యింది. డబ్బూ వృధా కావడం ఇష్టం లేక.. షూటింగ్ మొదలెట్టేశారు. క్షణక్షణానికీ పెరిగిపోతున్న శివలింగాన్ని మోయలేక ఆశక్తుడైన రావణాసురుడు.. ఆవేశంగా తన తలని శివలింగానికేసి బాదుకుంటుంటాడు. రక్తం ధారలై కారుతుంటుంది. ఆ దారుణాన్ని ఆపడానికి నారదుడు... మండోదరి సహితంగా పరిగెత్తుకు రావాలి.... ఇది సన్నివేశం. రావణాసుడు.. ఎన్టీయార్ కి, నారదుడు.. అక్కినేనికీ, మండోదరి.. జమునకీ... దర్శకుడు సీన్ వివరించాడు. ‘షాట్ రెడీ... కెమెరా... యాక్షన్’ అరిచాడు దర్శకుడు.
ఎన్టీయార్ శివలింగానికి తన తలని బాదుకుంటూ ఉద్వేగంగా నటిస్తున్నారు. అక్కినేని, జమునతో సహా ఆదుర్దాగా పరిగెత్తుకొస్తున్నారు. మధ్యలో ఏమైందో ఏమో... ఎన్టీయార్ తప్పు చేశారు. దర్శకుడు ‘కట్.. కట్’ అన్నారు. మళ్లీ షాట్ మొదలైంది. మళ్లీ అదే తప్పు. మళ్లీ షాట్ మొదలైంది. మళ్లీ తప్పు... తప్పు మీద తప్పు.. ఎవరికీ ఏమీ అర్థం కావడంలేదు. ఏ షాట్ అయినా... సింగిల్ టేక్ లో ఓకే చేసే ఎన్టీయార్ ఇన్ని టేకులు తినడమా? అందరికీ ఆశ్చర్యం. కానీ అక్కినేనికి మాత్రం అర్థమైంది. కావాలనే అలా చేస్తున్నాడని. కాలుతున్న ఇసుకలో కావాలనే జమునను పరిగెత్తిస్తున్నాడని. అయితే.. ఆ శిక్ష తనకూ పడుతోంది. కోపంలో ఆ విషయాన్ని ఎన్టీయార్ పట్టించుకోడంలేదు. చివరకు ఆయనే స్వయంగా ఎన్టీయార్ వద్దకెళ్లి.. ‘ఏంటి బ్రదర్.. నువ్వు ఆ అమ్మాయ్ మీద కోపం నాపై చూపిస్తున్నావ్. నాకు అసలే కాలు నొప్పి చేసి ఉంది. షాట్ ఓకే చేయ్’అనేసరికి... నెక్ట్స్ షాట్ ఓకే అయిపోయింది.
దర్శకుడు పేకప్ చెప్పేశాడు. ఎవరి కార్లలో వాళ్లు బయలుదేరడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే... ఎన్టీయార్ మాత్రం ‘నువ్వు నా కార్లో రా బ్రదర్’అన్నారు అక్కినేనితో. ఆయన కోపంగా ఉన్నాడు. అది అక్కినేనికి అర్థమవుతుంది. ఇద్దరూ కార్లో బయలుదేరారు. ఎన్టీయార్ మౌనంగా కూర్చుండిపోయారు. ఎంతసేపటికీ మాట్లాడకపోయేసరికి అక్కినేనే కల్పించుకొని ‘ఏంటి బ్రదర్ ఈ మౌనం?’అనడిగారు.
అప్పుడు ఎన్టీయార్ అన్న మొదటి మాట.. ‘ఈ అమ్మాయ్ సంగతి ఏంటి? ఏం చేద్దాం’ అని. ఆయన కోపం ఏ స్థాయిలో ఉందో అక్కినేనికి అర్థమైపోయింది. ‘చిన్నపిల్ల... ఏదో తెలీక చేసిందిలే బ్రదర్’ అన్నారు. ‘కాదు... శిక్ష పడకపోతే... ఇదే పని రిపీట్ అవుతుంది. ఇక నేను ఆ అమ్మాయితో చేయను. నువ్వూ చేయడానికి వీల్లేదు’అని నిర్మొహమాటంగా చెప్పేశారు ఎన్టీయార్. ఆయన నిర్ణయాన్ని అక్కినేని కూడా కాదనలేకపోయారు. అలా నాలుగేళ్లు జమునతో సినిమా చేయలేదు వారిద్దరూ. చివరకు చక్రపాణి దౌత్యంతో... ఈ వివాదం సద్దుమణిగింది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘గుండమ్మ కథ’ చిత్రంలో వారితో పనిచేయగలిగారు జమున.
అయితే.. ఆ గడచిన నాలుగేళ్లూ.. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, చిన్న హీరోలను ప్రోత్సహించారు జమున. సింగిల్ గానే బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. ఎన్ని అవరోధాలెదురైనా... ఆత్మాభిమానాన్ని వదులుకోలేదామె. చివరకు రాజకీయల్లో కూడా ఎన్టీయార్ కు ఎదురు నిలిచి, సత్తాచాటారు. నేడు కళాభారతి, ప్రజానటి జమున పుట్టిన రోజు. 82వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారామె. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఈ మహానటి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోందీ... ‘తెలుగు వన్’.
- నరసింహ బుర్రా