‘ఫిదా’లో సాయిపల్లవి తండ్రి గురించి మీకు తెలియని విషయాలు..?
on Aug 1, 2017
‘ఫిదా’సినిమాలో కథానాయిక తండ్రిగా నటించిన సాయి చంద్ గురించి ఈ తరంలో ఎంతమందికి తెలుసు? అంటే మౌనమే సమాధానం అవుతుంది. 80ల్లో సాయిచంద్ చాలా బిజీ ఆర్టిస్ట్. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. సాయిచంద్ గురించి చెప్పేముందు ఆయన తాతగారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హేతువాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కవిరాజుగా కీర్తిగడించిన మహానాయకుడు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి మనవడే ఈ సాయిచంద్. రామస్వామి పుట్టింది కృష్ణాజిల్లా అగలూరులో అయినా... ఆయన జీవితం మొత్తం గుంటూరు జిల్లా తెనాలిలోనే సాగింది. తెనాలి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశారు రామస్వామి. ఎన్నో అద్భుత సాహితీ గ్రంధాలు రాసిన ఆయన్ను ‘కవిరాజు’అని కూడా పిలుస్తుంటారు.
ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ...రామస్వామి తనయుడు త్రిపురనేని గోపిచంద్ కూడా జాతి గర్వించదగ్గ కథారచయితగా ఎదిగారు. ఆయన రాసిన ‘అసమర్థుని జీవిత యాత్ర’ నవల... నవలా ప్రపంచంలోనే ఓ సంచలనం. ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడయ్యే నవలలో ‘అసమర్థుని జీవిత యాత్ర’ కచ్చితంగా ఉంటుంది. ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ కూడా ఆయన రాసిన నవలే. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కలిపి దాదాపు ఓ 20 నవల్స్ రాశారు గోపిచంద్. ‘ఫిదా’లో హీరోయిన్ తండ్రిగా నటించిన సాయిచంద్... గోపిచంద్ కుమారుడే .
ఇక సాయిచంద్ విషయానికొస్తే... తెలంగాణ సాయుధ పోరాటమే ప్రధాన ఇదివృత్తంగా తెరకెక్కి... సంచలన విజయాన్ని అందుకున్న ‘మా భూమి’(1980) చిత్ర కథానాయకుడు సాయిచందే. ఆ సినిమా తర్వాత మంచుపల్లకి, పెళ్లీడు పిల్లలు, ఈ చదువులు మాకొద్దు, ఈ చరిత్ర ఏ సిరాతో, రంగుల కల, శివ, అంకురం చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించి ప్రేక్షకాభిమానం పొందాడు సాయిచంద్. తన కెరీర్లో ఎక్కువ భాగం సామాజిక విలువలతో కూడిన సినిమాల్లోనే నటించిన క్రెడిట్ సాయిచంద్ సొంతం.
గత కొన్నేళ్లుగా వేరే వ్యాపకంతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన సాయిచంద్ ‘ఫిదా’తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పటిరకూ హీరోగా, హీరోయిన్ అన్నగా, లేక పోలీస్ అధికారిగా పలు సినిమాల్లో కనిపించిన సాయిచంద్... తొలిసారి ‘ఫిదా’లో తండ్రి పాత్ర పోషించి అందరి మన్ననలనూ పొందుతున్నారు.
ఏది ఏమైనా.. సాయిచంద్ రూపంలో తెలుగు తెరకు ఓ మంచి తండ్రి దొరికాడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
బెస్ట్ ఆఫ్ లక్ సాయిచంద్ గారూ...
Also Read