చిరు, నాగ్, బాలయ్య....కలబడిపోతున్నారు
on Sep 7, 2016
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర పెను సంచలనం నమోదు కాబోతోంది. అవును... ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని బాక్సాఫీస్ బిగ్ ఫైట్ ఇది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు ఈ సంక్రాంతి బరిలో దిగిపోతున్నారు. వాళ్లే... చిరు, బాలయ్య, నాగ్. ఈ ముగ్గురిదీ 30 ఏళ్ల అనుభవం. టాప్ స్టార్లుగా దశాబ్దం పాటు ఇండ్రస్ట్రీని ఏలిన చరిత్ర వీళ్లది. అయితే చాలా అరుదుగా మాత్రమే బాక్సాఫీసు దగ్గర వీళ్ల పోరు చూసే అవకాశం దక్కేది. ఎక్కువగా చిరు, బాలయ్య సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. ముగ్గురు హీరోలు తలపడడం మాత్రం... ఎప్పుడూ జరగలేదు. అయితే... ఈసారి మాత్రం ఆ అద్భుతం జరగబోతోంది.
చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య కూడా అంతే. గౌతమి పుత్ర శాతకర్ణిని సంక్రాంతికే విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు నాగార్జున కూడా సంక్రాంతి రేసులోకి వచ్చాడు. నమో వేంకటేశాయ చిత్రాన్ని ముగ్గుల పండక్కే రిలీజ్ చేస్తానంటున్నాడు నాగ్. అంటే.. ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోల చిత్రాలు పోటీపడబోతున్నాయన్నమాట. ఈ మూడు సినిమాలకూ కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయా, లేదా? అసలు ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రెడీ అవ్వగలవా? అనే లెక్కల్ని పక్కన పెడితే... ఒకేసారి ఈ ముగ్గురు హీరోలూ ఢీ కొట్టాలన్న ఆలోచన రావడం మాత్రం.. సాహసమే. ఈ యేడాది సంక్రాంతిని నాలుగు సినిమాలొచ్చాయి. కాబట్టి 2017లో మూడు సినిమాలు పోటీ పడడం విచిత్రమేం కాదు. నిజంగా ఈ మూడు సినిమాలూ ఒకేసారి వచ్చేస్తే.. అదే అసలు సిసలైన సంక్రాంతి బొనాంజా అనుకోవొచ్చు. గెట్ రెడీ ఫర్ ద సినీ సంక్రాంతి.