ఆస్కార్ దారిలో తెలుగు సినిమా ఎక్కడ?.. సోదిలో లేని 'డియర్ కామ్రేడ్'
on Sep 24, 2019
ఆస్కార్ నామినేషన్ కోసం ఇండియన్ అఫిషియల్ ఎంట్రీ పరిశీలనలో మరోసారి టాలీవుడ్కు మొండిచేయి ఎదురయ్యింది. 'బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్' కేటగిరీలో నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. 2019 సంవత్సరానికి బాలీవుడ్ మూవీ 'గల్లీ బాయ్'ను అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. ఈ ఎంట్రీ కోసం దేశంలోని వివిధ భాషల నుంచి 27 సినిమాల్ని పరిశీలించారు. వాటిలో తెలుగు నుంచి వెళ్లిన ఒకే ఒక్క సినిమా 'డియర్ కామ్రేడ్'. విజయ్ దేవరకొండ నటించగా భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఆస్కార్ నామినేషన్కు ఇండియన్ అఫిషియల్ ఎంట్రీగా ఎంపికవుతుందనీ, దానికంత సీన్ ఉందనీ తెలుగు సినీప్రియులెవరూ ఆశలు పెట్టుకోలేదు. ఆ విషయం అలా ఉంచితే బెంగాలీ డైరెక్టర్ అపర్ణా సేన్ ఆధ్వర్యంలోని జ్యూరీ 'గల్లీ బాయ్'ను ఎంపిక చెయ్యడం విమర్శలకు తావిచ్చింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించగా, జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసిన ఆ మూవీది ఒరిజినల్ స్క్రిప్ట్ కాదనీ, కొన్ని సినిమాల నుంచి తయారుచేసిన స్క్రిప్టుతో దాన్ని తీశారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై గల్లీల్లో పెరిగిన ఒక సాధారణ యువకుడు ర్యాప్ సింగర్గా పాపులర్ అవడం ఈ సినిమాలోని ప్రధానాంశం.
కాసేపు ఈ వివాదాన్ని పక్కనపెడితే.. ఆస్కార్ దారిలో మన తెలుగు సినిమా ఎక్కడ ఉందీ.. అని పరిశీలిస్తే.. చాలా బాధ కలుగుతుంది. మన సినిమా వాళ్లను "మీ ఆశయం ఏమిటి?" అనడిగితే, వారిలో చాలామంది "ఆస్కార్ సాధించడం" అంటుంటారు. ఎవరైనా ఏదైనా సాధిస్తే, "ఇది నాకు ఆస్కార్ లాంటిది" అని చెబుతుంటారు. అంటే ప్రపంచ సినిమాలో ఆస్కార్ లేదా అకాడమీ అవార్డులకు అంతటి విలువ, కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయన్న మాట. కానీ ఆ అవార్డుల్ని ఇచ్చేది హాలీవుడ్కు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థ. ఆస్కార్స్ అనేవి ప్రధానంగా హాలీవుడ్ సినిమాలకు ఉద్దేశించినవే. అంటే హాలీవుడ్లో తయారైన సినిమాలకే వాటిని ఇస్తుంటారు. ఇతర దేశాలకు చెందిన సినిమాలు అక్కడ గెలుచుకోనే ఛాన్స్ ఉన్న ఒకే ఒక్క అవార్డు 'బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్' అవార్డ్. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఎ.ఆర్. రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి గెలుచుకున్న ఆస్కార్ అవార్డులు హాలీవుడ్ సినిమా 'స్లండాగ్ మిలియనీర్'కు పనిచేయడం ద్వారా గెలుచుకున్నవే.
వాస్తవం ఇది కాగా "నా జీవితాశయం ఆస్కార్ అవార్డ్ సాధించడం" అని అనేస్తూ ఉంటారు మనవాళ్లు. ఆస్కార్ అవార్డు గెలవడం అటుంచి, ఆస్కార్ నామినేషన్ కూడా ఇంతవరకూ ఏ తెలుగు సినిమా సాధించలేదు. అది కూడా కాదు.. కనీసం ఆస్కార్ నామినేషన్ కోసం భారతదేశపు అఫిషియల్ ఎంట్రీగా వెళ్లే అర్హతని కూడా తెలుగు సినిమాలు పొందకపోవడం బాధాకరం. 1957 నుంచి మొదలుకొని 2018 వరకూ 62 సంవత్సరాల్లో ఇండియన్ అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్ నామినేషన్ కోసం పోటీపడిన తెలుగు సినిమాలు ఎన్ని ఉండొచ్చని అనుకుంటున్నారు. ఎన్నో కాదు.. ఒక్కటంటే ఒక్కటి. అవును. ఆ ఒక్క సినిమా 'కళాతపస్వి'గా పేరుపొందిన కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతిముత్యం'. కమల్ హాసన్, రాధిక కలిసి నటించిన ఆ కళాఖండం 1986 ఆస్కార్ నామినేషన్ కోసం అఫిషియల్ ఎంట్రీగా మనదేశం తరపున వెళ్లింది కానీ నామినేషన్ సాధించలేకపోయింది. ఆ తర్వాత ఇంతవరకు మరే తెలుగు సినిమా ఇండియన్ అఫిషియల్ ఎంట్రీగా నామినేషన్ కోసం వెళ్లే ఛాన్స్ దక్కించుకోలేదు.
మరోవైపు మన పొరుగున ఉన్న తమిళం నుంచి ఏకంగా తొమ్మిది సినిమాలు ఆస్కార్ నామినేషన్ కోసం ఇండియన్ అఫిషియల్ ఎంట్రీగా అవకాశం పొందాయి. ఆ సినిమాలు.. 'దైవ మగన్', 'నాయకన్', 'అంజలి', 'దేవర్ మగన్', 'కురుది పునాల్', 'ఇండియన్', 'జీన్స్', 'హే రామ్', 'విసారణై'. వీటిలో మణిరత్నం సినిమాలు రెండు, శంకర్ సినిమాలు రెండు, కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉండటం గమనార్హం. ఈ పోలికను బట్టి చూస్తే ఇటు జాతీయ స్థాయిలో కానీ, అటు అంతర్జాతీయ స్థాయిలో కానీ కంటెంట్ పరంగా మనం తమిళం కంటే చాలా వెనుకంజలో ఉన్నామని తెలిసిపోతుంది.
ఇక మళ్లీ ప్రస్తుతానికి వస్తే.. 'గల్లీ బాయ్' కంటే ఒరిజినల్ కంటెంట్తో తయారైన రెండు తమిళ సినిమాలకు అఫిషియల్ ఎంట్రీగా వెళ్లే అర్హత ఉందని విమర్శకులు అంటున్నారు. ఆ రెండు.. 'వడ చెన్నై', 'సూపర్ డీలక్స్'. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన 'వడ చెన్నై'ని ధనుష్ నిర్మించి నటించాడు. త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేసిన 'సూపర్ డీలక్స్'లో సమంత, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 2016లో ఇండియన్ అఫిషియల్ ఎంట్రీగా వెళ్లిన 'విసారణై' డైరెక్టర్ కూడా వెట్రిమారనే. లాబీయింగ్తోటే 'గల్లీ బాయ్'ను ఎంపిక చేశారని దక్షిణాది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా కంటెంట్ పరంగా ఒరిజినాలిటీని చూపిస్తూ, స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ చక్కని సినిమా రూపొందిస్తుంటే, టాలీవుడ్ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాల అడ్డాగా పేరు తెచ్చుకొనే అవకాశం ఉంటుంది.
Also Read