ఇది వారసురాళ్ల కాలం!
on Oct 29, 2019
ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్లుగా వారసులు వస్తున్నారు.. అబ్బే.. ఇది చాలా పాత మాట. మరి కొత్త మాటేమిటి? యాక్టర్లుగా వారసురాళ్లు వచ్చారు.. వస్తున్నారు. అసలు వాళ్ల అమ్మాయిల్ని హీరోయిల్ని చెయ్యడానికి మన టాలీవుడ్ యాక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఒప్పుకుంటున్నారా? రోజులు మారుతున్నాయ్. టాలీవుడ్డూ మారుతోంది. ఒకరిద్దరు కాదు ఒకరి తర్వాత ఒకరుగా వారసురాళ్లు తెరంగేట్రం చెయ్యడం ఇప్పుడు టాలీవుడ్లో ఒక ట్రెండ్. ఒక హీరో కొడుకో, క్యారక్టర్ ఆర్టిస్ట్ కొడుకో, లేదా ఇంకో ప్రొడ్యూసర్ కొడుకో హీరో అవడం చాలా కాలం నుంచే మనం చూస్తున్నాం. అది టాలీవుడ్లోనే కాదు, ఏ వుడ్లోనైనా కామన్.
అట్లాగే బాలీవుడ్లో హీరోల డాటర్లు హీరోయిన్లు అవడం కూడా కామనే. కరిష్మా కపూర్, కరీనా కపూర్, సోనం కపూర్, అథియాశెట్టి, సారా అలీఖాన్, అనన్యా పాండే, జాన్వి కపూర్ వంటివాళ్లు అలా తమ తండ్రుల, తల్లుల వారసత్వాన్ని బాలీవుడ్లో కొనసాగిస్తున్నారు. బాలీవుడ్లో హీరోల కూతుళ్లు తెరంగేట్రాలు చెయ్యడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. తండ్రులు కూడా తమ కూతుళ్లు హీరోయిన్ అవుతానంటే ఆంక్షలేమీ పెట్టరు. ఈ విషయంలో కొడుకులకో రూల్, కూతుళ్లకో రూల్ అన్నట్లు వ్యవహరించరు.
కానీ టాలీవుడ్ ఈ విషయంలో చాలా డిఫరెంట్ అని మనందరికీ తెలుసు. కొడుకులను హీరోలుగా ఇంట్రడ్యూస్ చెయ్యడానికి ఉత్సాహపడే మన హీరోలు కానీ, నిర్మాతలు కానీ తమ కూతుళ్లు హీరోయిన్ అవుతానంటే మాత్రం అభ్యంతరపెడతారు. దీనికి కారణం హీరోయిన్లంటే ఆడియెన్స్లో, ఫ్యాన్స్లో ఉండే ఒక రకమైన చులకన భావమని చెప్పాలి. దాన్ని ప్రెస్టీజ్ ఇస్యూగా భావిస్తుంటారు. అయితే ఆ రోజులు మారిపోతున్నాయి. యాక్టర్ కావడంలో అబ్బాయిలకు ఒక రూల్, అమ్మాయిలకు ఇంకో రూల్ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మన యాక్టర్ల కూతుళ్లు.
కొన్నేళ్ల క్రితం హీరో జగపతిబాబు సరసన నటించడానికి సూపర్స్టార్ కృష్ణ కుమార్తె మంజుల రెడీ అయ్యేసరికి కృష్ణ ఫ్యాన్స్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కృష్ణగారు కూడా వాళ్ల ప్రెజర్ తట్టుకోలేక మంజులకు నచ్చచెప్పి ఆ సినిమా నుంచి డ్రాప్ అయ్యేలా చేశారు. అప్పుడు మంజుల చాలా అప్సెట్ అయ్యారు. తనకు నచ్చిన పని చేసే స్వతంత్రం లేకుండా పోయిందని కూడా ఆమె బాధపడ్డారు.
అప్పటికి మంజుల తెరంగేట్రం ఆగిపోయినా, నటిని కావాలనే ఆమెలోని జీల్ అలాగే ఉండిపోయింది. దాంతో కొంత కాలం గడిచాక చడీచప్పుడు లేకుండా 2002లో 'షో' అనే సినిమాలో హీరోయిన్గా నటించి ఆడియన్స్, ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చారు. ఆ మూవీ ఏకంగా నేషనల్ అవార్డ్ సంపాదించేసి మంజులను పాపులర్ చేసేసింది. ఆ అవార్డ్ వచ్చాకే మంజుల 'షో' అనే సినిమా చేశారనే విషయం బయటి లోకానికి తెలిసింది. ఆ తర్వాతే ఆ సినిమా థియేటర్లలో రిలీజయ్యింది. అయితే అంతకంటే ముందే ఆమె 'సమ్మర్ ఇన్ బెత్లెహాం'అనే మలయాళ మూవీలోనూ, 'రాజస్థాన్' అనే తమిళ సినిమాలోనూ నటించారు. అవి హీరోయిన్ రోల్స్ కావు. 'షో' తర్వాత కూడా మంజుల రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా నటించలేదు. 'కావ్యాస్ డైరీ', 'ఆరంజ్', 'సేవకుడు' సినిమాల్లో మాత్రమే కీలక కేరెక్టర్స్లో కనిపించారు.
టాలీవుడ్లో ఒక హీరో వారసురాలు హీరోయిన్ కావడం మంజులతో మొదలు కాలేదు. అంతకు సిక్స్ యియర్స్ బ్యాకే ఒక మహానటుడి మనవరాలు హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. ఆమె సుప్రియ. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు. అంటే కూతురి కూతురు. హీరో సుమంత్ సిస్టర్. 1996లో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలో ఆమె పవర్స్టార్ పవన్ కల్యాణ్కు జోడీగా యాక్ట్ చేశారు. అది పవన్కూ డెబ్యూ మూవీనే.
అలా మన స్టార్ హీరోలకు సంబంధించి తొలిసారిగా హీరోయిన్గా కనిపించిన అమ్మాయి సుప్రియే. అయితే సుప్రియ హీరోయిన్గా కనిపించింది ఆ ఒక్క సినిమాలోనే. దానికే చాలామంది బుగ్గలు నొక్కుకున్నారు. అక్కినేని మనవరాలు హీరోయిన్ అవడమేంటని ఓపెన్గా అన్నవాళ్లు చాలామందే. దానికి తగ్గట్లు ఆ మూవీ తర్వాత ఆమె 2018 దాకా మళ్లీ స్క్రీన్పై కనిపించలేదు. 2018లో రిలీజైన అడివి శేష్ మూవీ 'గూఢచారి'లో ఆమె ఒక క్రూషియల్ కేరెక్టర్తో మళ్లీ ఆడియెన్స్కు దర్శనమిచ్చారు.
సుప్రియ, మంజుల తెరంగేట్రం చేసిన తర్వాత కూడా వేరే స్టార్స్ కూతుళ్లెవరూ వెంటనే యాక్టర్లుగా కనిపించలేదు. కొంత కాలానికి కలెక్షన్ కింగ్గా పేరుపొందిన మోహన్బాబు కుమార్తె మంచు లక్ష్మి విలన్గా తెరంగేట్రం చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఆ సినిమా 'అనగనగా ఓ ధీరుడు'. ఆ సినిమాతోటే కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ హీరోయిన్గా టాలీవుడ్కు ఇంట్రడ్యూస్ అవడం విశేషం. ఫస్ట్ మూవీలో చూపిన పర్ఫార్మెన్స్తో మంచు లక్ష్మి ఏకంగా బెస్ట్ విలన్గా నంది అవార్డ్ కొట్టేశారు. ఇంటి నుంచీ, ఫ్యాన్స్ నుంచీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకపోవడంతో మంచు లక్ష్మి కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్లు వేసిన బాటలో ఒక్కరొక్కరుగా యాక్టర్ల కూతుళ్లు వెండితెరపై తమను తారగా చూసుకోవాలని ముందుకు వస్తున్నారు. తండ్రులూ వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మొదట టీవీలో ప్రోగ్రాం ప్రెజెంటర్గా రాణించి, ఆ తర్వాత 2016లో 'ఒక మనసు' అనే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ కంటే ముందు సేం యియర్ 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్లో నిహారిక యాక్ట్ చేశారు. అప్పట్నుంచీ ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. రీసెంట్గా 'సూర్యకాంతం'గా ఆమె తెరపై దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. నిహారిక హీరోయిన్ అవుతానన్నప్పుడు మొదట సందేహించిన నాగబాబు, ఆ తర్వాత ఆమెలోని తపన చూసి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. కొడుకులు ఎలాగో కూతుళ్లూ అంతేననీ, వాళ్ల ఇంటరెస్ట్స్ను గౌరవించాలనీ ఆయన చెప్పారు కూడా.
లేటెస్ట్గా రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక 'దొరసాని'గా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని గడీల కాలపు బ్యాక్డ్రాప్తో టీనేజ్ లవ్ స్టోరీగా తయారైన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఇంట్రడ్యూస్ అవడం గమనార్హం. నిజానికి శివాత్మిక కంటే ముందుగానే ఆమె అక్క శివాని హీరోయిన్గా ఆడియెన్స్ ముందుకు రావాల్సింది. కానీ ఆమె హీరోయిన్గా నటిస్తోన్న '2 స్టేట్స్' సినిమా మేకింగ్లో ఆలస్యం కారణంగా చెల్లెలి కంటే లేటుగా స్క్రీన్ మీద కనిపించనుంది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ '2 స్టేట్స్'కు రీమేక్గా అదే పేరుతో తయారవుతున్న ఈ సినిమాలో అడివి శేష్కు జోడీగా శివాని కనిపించబోతోంది. తమ కూతుళ్లిద్దర్నీ హీరోయిన్లుగా చూసేందుకు రాజశేఖర్, జీవిత దంపతులు ఉత్సాహపడుతున్నారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.
'మల్లెమొగ్గలు' హీరో, సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తమ్ముడైన దివంగత రాజేశ్ కూతురు ఐశ్వర్యా రాజేశ్ కూడా 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో క్రికెటర్గా నటించి టాలీవుడ్కు పరిచయమైంది. ఈ సినిమా ఆగస్టులో రిలీజై, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో ఆమె రాజేంద్రప్రసాద్ కూతురిగా కనిపించింది. ఇప్పటికే ఆమె తమిళంలో 25 మూవీస్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్కు వచ్చింది. ఆమె ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి ఉదయ్ శంకర్ అనే కొత్త హీరోతో చేస్తున్న 'మిస్మ్యాచ్' కాగా, మరొకటి విజయ్ దేవరకొండ సరసన చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్'.
వీళ్లను చూస్తుంటే రానున్న రోజుల్లో మరింతమంది వారసురాళ్లు తారలుగా సిల్వర్స్క్రీన్పైకి రావడం ఖాయమన్న నమ్మకం కలుగుతోంది. అమ్మాయిలపై ఇదివరకటి రెస్ట్రిక్షన్స్ పోయి, వాళ్ల ఇష్టాల్ని ఎంకరేజ్ చేస్తుండటమే టాలీవుడ్లో ఈ మార్పుకు కారణం. ఇక వచ్చేది వారసురాళ్ల కాలమే!