సూర్య సినిమాలను బ్యాన్ చేయనున్న తమిళనాడు థియేటర్లు?
on Apr 26, 2020
లాక్డౌన్ అనేది సినిమా ఇండస్ట్రీపై ఎంతటి దుష్ప్రభావం చూపిస్తున్నదనే దానికి సూర్య భార్య జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన 'పొన్మంగల్ వంధాల్' సినిమా ఒక నిదర్శనం. ఆ సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలీదు. ఈ నేపథ్యంలో 'పొన్మంగల్ వంధాల్'ను నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ సినిమాను నిర్మించిన 2డి ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సంస్థతో ఈ మేరకు అది డీల్ కుదుర్చుకుంది. అది సూర్య సొంత నిర్మాణ సంస్థ.
దీంతో తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ భగ్గుమంది. దాని ప్రధాన కార్యదర్శి పన్నీర్సెల్వమ్ 2డి ఎంటర్టైన్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. థియేటర్ల కోసం నిర్మించిన సినిమాను మొదట థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ, అలా కాకుండా ఇతర వేదికలపై వాటిని రిలీజ్ చేయకూడదనీ తేల్చి చెప్పారు. 'పొన్మంగల్ వంధాల్' మూవీని మొదట థియేటర్లలోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన, తమ డిమాండ్ను పట్టించుకోకుండా ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే, భవిష్యత్తులో 2డి ఎంటర్టైన్మెంట్ తీసే సినిమాలే కాకుండా, సూర్య నటించిన సినిమాలను కూడా తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబోమని హెచ్చరించారు.
దీంతో 'పొన్మంగల్ వంధాల్'ను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేస్తే, సూర్య హీరోగా సుధ కొంగర డైరెక్ట్ చేసిన 'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా') మూవీ పరిస్థితి ఏమవుతుందనేది సందేహంలో పడింది.