నాగార్జునా... మీరు వెళ్లండి! నేను చూసుకుంటా!!
on May 29, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు, కొట్లాటలు వంటివాటికి నాగార్జున ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఆయన ఎవరిపైనా కామెంట్స్ చేయరు. సాధారణంగా నాగార్జున అంటే ఎవరూ కామెంట్ కూడా చేయరు. అటువంటి నాగార్జునకు గురువారం వింత పరిస్థితి ఎదురైంది. మళ్ళీ షూటింగులు పునః ప్రారంభించే విషయమై తెలంగాణ ప్రభుత్వ అధికారులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. చర్చలు పూర్తయిన తర్వాత మీడియా ముందుకొచ్చి నాగార్జున మాట్లాడారు. అప్పటికే చర్చలకు తనను పిలవలేదని, తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటు మీడియాలో, అటు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఆ వివాదం గురించి నాగార్జున దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఆయన స్పందన కోరారు. అయితే, నాగార్జునను తలసాని కాపాడారు. గండం నుండి గట్టెక్కించారు.
"మీరు (నాగార్జున) వెళ్ళండి. నేను చూసుకుంటా" అని అక్కడి నుండి సినిమా ప్రముఖులను తలసాని పంపేశారు. "వాళ్ళు (నాగార్జున, ఇతరులు) మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. నేను మాట్లాడతాను" అని మీడియాని ఉద్దేశించి చెప్పారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నాగార్జున మాట్లాడితే ఏం మాట్లాడేవారో? ఆయన మాటలపై ఇండస్ట్రీ నుండి ఎటువంటి స్పందన వ్యక్తం వచ్చేదో? మొత్తానికి వివాదం నుండి నాగార్జునను తలసాని కాపాడినట్టే.