శ్రీకాంత్ `తాళి`కి పాతికేళ్ళు!
on Jan 24, 2022
మైటీ స్టార్ శ్రీకాంత్, స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేశాయి. వాటిలో `తాళి` ఒకటి. తాళి ప్రాధాన్యం చుట్టూ అల్లుకున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీకాంత్ కి జోడీగా శ్వేత, స్నేహ, స్వాతి నటించగా.. శ్రీ విద్య, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జున రావు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. ఎం.ఆర్.సి. మూవీ క్రియేషన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విద్యాసాగర్ బాణీలు కట్టిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, షణ్ముఖ శర్మ సాహిత్యమందించారు. ``గుంతలకిడి గుమ్మాడి``, ``ఓసోసి కన్నె కసి``, ``ముద్దుగుమ్మలిద్దరు``, ``పాప నిన్నే పట్టుకోనా``, ``ఏమైందో ఏమోనమ్మా``, ``గుప్పు గుప్పు గుప్పుమంది``, ``ఉల్లె ఉల్లెలె``.. ఇలా ఇందులోని పాటలన్నీ రంజింపజేశాయి. ఈ చిత్రానికి గానూ `ఉత్తమ నృత్య దర్శకుడు` విభాగంలో తరుణ్ మాస్టర్ `నంది` పురస్కారం అందుకున్నారు. 1997 జనవరి 24న విడుదలై జననీరాజనాలు అందుకున్న `తాళి`.. నేటితో పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
Also Read