ఎస్పీబీ ఫోన్ చేసి మరీ తిట్టారు! – తమన్
on Dec 3, 2019
‘‘నా కెరీర్ గురించి చెప్పుకోవాలంటే... ‘మహానుభావుడు’ చిత్రానికి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ‘మహానుభావుడు’తో నా కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. తర్వాత ‘తొలిప్రేమ’, ‘ఛల్ మోహన్రంగ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ‘సరైనోడు’ తర్వాత ఏడాది విరామం తీసుకున్నాననీ, ఆది తనకెంతగానో ఉపయోగపడిందనీ, ఆ విరామంలో ఎటువంటి సంగీతం అందించాలనేదీ, ఎలాంటి సినిమాలు చేయాలనేది తెలిసిందనీ ఆయన తెలిపారు.
డిసెంబర్ 13న విడుదల కానున్న ‘వెంకీ మామ’, 20న విడుదల కానున్న ‘ప్రతిరోజూ పండగే’, జనవరి 12న సంక్రాంతి కానుకగా వస్తున్న ‘అల... వైకుంఠపురములో’, జనవరి 24న వస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రాలకు తమన్ సంగీతం అందిచారు. ప్లానింగ్ ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా వరుస సినిమాలు చేస్తున్నానని తమన్ తెలిపారు. ‘వెంకీమామ’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఎమోషనల్ ఫిల్మ్. నేను ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ కాపీ చూస్తూ, కంటతడి పెట్టాను. వెంకటేశ్గారు, నాగచైతన్య పోటీపడి నటించారు. మంచి పాటలు చేసే అవకాశం లభించింది. రెట్రో సాంగులో వెంకటేశ్గారు డ్యాన్సు ఇరగదీశారు’’ అన్నారు.
రీమిక్స్ సాంగ్స్ చేయకూడదని అనుకుంటున్నట్టు తమన్ తెలిపారు. ‘నాయక్’లో ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో...’, ‘ఇంటిలిజెంట్’లో ‘ఛమక్ ఛమక్ ఛామ్’తో పాటు తమన్ కొన్ని రీమిక్స్ చేశారు. ‘‘ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఫోన్ చేసి మరీ తిట్టారు. ఒక రీమిక్స్ సాంగ్ గురించి తిట్టారు. నాకు ఒక 60 ఏళ్లు వచ్చాక... నా పాటలను ఎవరైనా రీమిక్స్ చేస్తే నేనూ ‘పాడుచేశాడు’ అని తిట్టుకుంటాను. అందుకని, వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నా’’ అన్నారు. ఇంతకీ, ఏ పాట విషయంలో ఎస్పీబీ తిట్టారో చెప్పలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
