ENGLISH | TELUGU  

మౌనం వీడిన సోనూ.. ఐయామ్ బ్యాక్ అంటూ సంచలన ట్వీట్!

on Sep 20, 2021

 

కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. అయితే ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలతో సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనూసూద్‌ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు అధికారులు తెలిపారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్ తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రూ.18 కోట్లకు పైగా ఫండ్స్ సేకరించారు. అయితే, అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు  ఖర్చు పెట్టారని అధికారులు గుర్తించారు. కోట్లలో పన్ను ఎగవేత, ఫౌండేషన్ ద్వారా సేకరించిన ఫండ్స్ లో ఎక్కువ మొత్తం అకౌంట్ లోనే ఉండిపోవడంతో.. కొందరు సోనూసూద్ పై విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన సోనూసూద్.. ఫండ్స్ గురించి స్పష్టతనిచ్చారు.

సోమవారం ట్విట్టర్ వేదికగా సోనూసూద్ స్పందించారు. 'అసలేం జరిగిందో అంటూ నీ వాదనను నువ్వు ప్రతిసారి వినిపించాల్సిన అవసరం లేదు.. కాలమే చెబుతుంది' అంటూ సోనూ ఒక నోట్ ను విడుదల చేశారు. "నాకు తోచినంతలో నా దేశ ప్రజలకు సాయం చేయాలని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేషన్ లో ఉన్న ప్రతి రూపాయి.. విలువైన జీవితాలని కాపాడటం కోసం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఎదురుచూస్తుంది. కొన్ని కారణాల వల్ల గత నాలుగు రోజులుగా అందుబాటులో లేను. మీకు సేవ చేయడానికి మళ్ళీ తిరిగి వచ్చాను. జీవితాంతం నా ఈ ప్రయాణం కొనసాగుతుంది. జై హింద్" అంటూ సోనూ ట్వీట్ చేశారు.

సోనూసూద్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీకు అండగా మేమున్నాం అంటూ నెటిజన్లు సోనూని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.