అక్షయ్ కుమార్ను ఫాలో అవుతున్న శర్వానంద్
on Feb 8, 2020
లేటెస్ట్ ఫిల్మ్ 'జాను' మూవీలో కె. రామచంద్ర పాత్రలో ఆకట్టుకొని, అందరి ప్రశంసలూ పొందుతున్న శర్వానంద్ కెరీర్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మిగతా స్టార్ హీరోలు సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ తీసుకొని నటిస్తూ ఉంటే, అక్షయ్ మాత్రం ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సూత్రాన్ని అనుసరించాలని శర్వానంద్ నిర్ణయించుకున్నాడు.
"ఇప్పటిదాకా ఒక సినిమా పూర్తయి, విడుదలయ్యాకే ఇంకో సినిమా గురించి ఆలోచించేవాడిని. అయినా 'పడిపడి లేచేమనసు', 'రణరంగం' సినిమాలతో దెబ్బతిన్నా. ఆ సినిమాలు విడుదలైనప్పుడు వాటికి వచ్చిన రివ్యూస్ చూసి అలా ఎందుకు రాశారనుకున్నా. ఇప్పుడు అదే క్రిటిక్స్ 'జాను' సినిమానీ, అందులో నా నటననీ మెచ్చుకుంటుంటే ఆనందం వేసింది. నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకుంటే 'పడిపడిలేచే మనసు', 'రణరంగం' సినిమాల్లో జరిగిన పొరపాట్లు అర్థమయ్యాయి. ఇకనుంచీ నా పాత్రలతో పాటు కథలకూ ప్రాధాన్యం ఇవ్వాలనీ, ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలు ఉంచుకోవాలనీ డిసైడయ్యాను. ఈ విషయంలో అక్షయ్ కుమార్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటున్నా. అందుకే 'జాను' చేస్తుండగానే 'శ్రీకారం' మూవీ మొదలుపెట్టాను. అతి త్వరలో మరో సినిమా కూడా అనౌన్స్ చెయ్యబోతున్నా" అని అతను తెలిపాడు.
తమిళ హిట్ ఫిల్మ్ '96'కు రీమేక్ అయిన 'జాను'లో సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరూ గొప్పగా అభినయం ప్రదర్శించారని ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు వాళ్లను ప్రశంసిస్తున్నారు.
Also Read