షారుఖ్ 2000 కోట్లు వదులుకోవాల్సిందేనా..?
on Oct 5, 2016
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న కలల సౌధం "మన్నత్" వివాదం కారణంగా చివరకు సీజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే ముంబై బాంద్రా శివార్లలో ఉన్న మన్నత్ను 1995లో 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు షారుఖ్. దానిలో తన అభిరుచికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయించి అందమైన భవంతిగా తీర్చిదిద్డాడు. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ 333 మిలియన్ డాలర్లు..అంటే భారత కరెన్సీలో 2000కోట్ల రూపాయల అంచనా.
అయితే భవంతిని అందంగా మార్చే క్రమంలో షారుఖ్ తన ఇంటి ముందున్న స్థలంలో అక్రమంగా ర్యాంపు కట్టించాడని అది అక్రమ నిర్మాణం అవుతుందని వాచ్డాగ్ ఫౌండేషన్ ముంబై నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు దానిని తొలగించారు. దానిని కూల్చడానికి అయిన ఖర్చు రూ.1.93 లక్షలను జరిమానాగా కట్టాలని బీఎంసీ షారుఖ్కు నోటీసులు పంపించింది. తాజాగా ఇదే ఫాండేషన్ మరోసారి కింగ్ఖాన్పై కన్నెర్ర చేసింది. షారుఖ్ ఇంటి ముందు ర్యాంప్ కట్టడం అనేది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ని అతిక్రమించడం అవుతుందని వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి మన్నత్ను సీజ్ చేయాలని న్యాయస్థానంలో కేసు నమోదు చేసింది. దీంతో మళ్లీ వివాదం మొదటికొచ్చినట్లయింది. మరి షారుఖ్ ఇంటిని ఎలా కాపాడుకుంటాడో వేచి చూడాలి.