ENGLISH | TELUGU  

'మూవీ మొఘల్' లేని లోటు సుస్పష్టం!

on Feb 18, 2020

 

మూవీ మొఘల్‌గా పేరుపొందిన డి. రామానాయుడు మృతిచెంది నేటికి సరిగ్గా ఐదేళ్లు. రైతు కుటుంబంలో జన్మించి, కారంచేడు నుంచి మద్రాసు వెళ్లి సినీ నిర్మాతగా మారి, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, స్టూడియో అధినేతగా పలు విధాలుగా తెలుగు చిత్రసీమకు సేవచేసి, చివరి నిమిషం దాకా సినిమా కోసమే బతికిన రామానాయుడు ఒక మార్గదర్శిగా సినీ చరిత్రలో నిలిచిపోయారు. భారత దేశంలోని తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత కూడా ఆయనే. అంతేనా.. తన కుటుంబాన్నంతా సినిమాలకే అంకితమయ్యేలా చేసి.. ఆ క్రమంలో వందలాదిమందికి జీవనోపాధి కల్పించేందుకు దోహదపడ్డారు. ఆయన బాటలో పెద్దకుమారుడు సురేశ్ బాబు నిర్మాతగా మారి, ఇవాళ టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తుండగా, చిన్నకుమారుడు వెంకటేశ్ స్టార్ హీరోగా మూడు దశాబ్దాలకు మించిన కెరీర్‌ను ఇంకా కొనసాగిస్తున్నాడు. మనవడు రానా దగ్గుబాటి కూడా స్టార్ యాక్టర్‌గా గుర్తింపు పొందాడు.

ఇక ఆయన అక్కినేని నాగేశ్వరరావుకు వియ్యంకుడు అనే విషయం మనకు తెలిసిందే. కాకపోతే తను రామానాయుడు కుమార్తె లక్ష్మికి విడాకులిచ్చి అమలను నాగార్జున పెళ్లి చేసుకోవడం వేరే విషయం. అయినప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగలేదు. ఇప్పటికీ రెండు కుటుంబాలు అత్యంత సఖ్యతతో మెలగుతూ వస్తున్నాయి. ఆ రెండు కుటుంబాలకు వారధిగా నాగచైతన్య వ్యవహరిస్తున్నాడు. ఏఎన్నార్‌తో ఆది నుంచీ ఉన్న స్నేహాన్ని కడదాకా కొనసాగించారు రామానాయుడు. స్టార్ ప్రొడ్యూసర్‌గా రామానాయుడు ఎంత ఎత్తుకు ఎదిగినా, మనిషిగా ఆయనలోని మంచి గుణాలు చివరిదాకా నిలిచే వున్నాయి. బాంధవ్యాలకు ఆయన పెద్ద పీట వేస్తూనే వచ్చారు. అడిగినవారికి కాదనకుండా దానాలు చేస్తూనే వచ్చారు. అడగకపోయినా ఎంతోమందికి సాయం చేశారు. ఆయన నీడలో సేదతీరిన వాళ్ల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంతగా ఉంటుందనేది ఆయనతో సన్నిహితంగా మెలిగినవాళ్లందరికీ తెలుసు.

1989లోనే అధునాతన టెక్నాలజీతో రామానాయుడు స్టూడియోస్‌ను నెలకొల్పి, ఆ స్టూడియోకు స్క్రిప్టుతో అడుగుపెట్టి, ఫస్ట్ కాపీతో బయటకు వెళ్లే అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటుచేశారంటే ఆయన ముందుచూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన కేవలం పెట్టుబడి పెట్టే నిర్మాత కాదు. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ.. మంచి స్క్రిప్టును గుర్తించే అంశం దగ్గర్నుంచి.. తారాగణం ఎంపిక, షూటింగ్ షెడ్యూళ్ల దాకా అన్ని విషయాల్లోనూ పాలుపంచుకొనే అసలైన నిర్మాత. చాలా మంది నిర్మాతలకు భిన్నంగా యాక్టర్లు, టెక్నీషియన్లతో కలిసిపోయి, వాళ్లలో ఒకరిగా పనిచేసే ఒక అరుదైన సినీ కార్మికుడు రామానాయుడు.

సెట్స్‌పై పనిచేసేవాళ్లందరికీ భోజనం పెట్టడం ఒక ఎత్తు, వాళ్లు ఇష్టపడే పదార్థాలను అమర్చడం ఇంకో ఎత్తు. అందుకే 'నాయుడు గారి సినిమా షూటింగ్' అంటే అందరూ ఇష్టంగా పనిచేసేవారు. అటువంటి ఆరోగ్యకర వాతావరణం ఆయన సినిమా సెట్స్‌పై ఉండేది. కేవలం తెలుగు తారలే కాదు, నాయుడుగారిపై రాజేశ్ ఖన్నా, జితేంద్ర, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు.  రామానాయుడు లేని లోటు ఇవాళ టాలీవుడ్‌లో సుస్పష్టం. అలాంటి నిర్మాతను, యూనిట్ సభ్యులందర్నీ తన కుటుంబసభ్యుల్లా భావించే నిర్మాతను మళ్లీ చూడలేమని నిన్నటి తరం నటులు చెప్తున్న మాట అక్షరాలా నిజం.

(ఫిబ్రవరి 18 డి. రామానాయుడు వర్థంతి సందర్భంగా)

- బుద్ధి యజ్ఞమూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.