ధనుష్, శేఖర్ కమ్ముల.. ఓ పొలిటికల్ థ్రిల్లర్?
on Jun 24, 2021
కోలీవుడ్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ధనుష్ ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని టాక్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నాయికగా నటించబోతోందని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ధనుష్, శేఖర్ కమ్ముల ఫస్ట్ జాయింట్ వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా.. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోందట. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ధనుష్ పోషిస్తున్న పాత్రే.. సినిమాకి హైలైట్ అని వినికిడి. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. మరి.. `లీడర్` (2010) తరువాత మళ్ళీ పొలిటికల్ డ్రామాలకి జోలికి వెళ్ళని శేఖర్ కమ్ముల.. ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
కాగా, శేఖర్ కమ్ముల తాజా చిత్రం `లవ్ స్టోరి` విడుదలకు సిద్ధమైంది. ఇక ధనుష్ విషయానికొస్తే.. ప్రస్తుతం `ఆత్రంగి రే` (హిందీ), కార్తిక్ నరేన్ డైరెక్టోరియల్ (తమిళ్), `ద గ్రే మ్యాన్` (ఆంగ్లం) చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారు.