దేవా కట్టా డైరెక్షన్లో సాయితేజ్.. ఓపెనింగ్కు వచ్చిన పవర్ స్టార్!
on Mar 12, 2020
రెండు వరుస హిట్లు - చిత్రలహరి, ప్రతిరోజూ పండగే రావడంతో మంచి జోరు మీదున్న సాయితేజ్ త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ మూవీ మే 1న రిలీజ్ కానున్నది. ఈలోగా ఇంకో సినిమా మొదలు పెట్టేశాడు సాయితేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ కెరీర్లో ఆశించిన రీతిలో హిట్లు సాధించలేకపోతున్న దేవా కట్టా డైరెక్షన్లో అతను నటిస్తున్నాడు. ఈ సినిమా గురువారం లాంఛనంగా మొదలైంది. సాయితేజ్కు అమితానందం కలిగిస్తూ ఈ సినిమా ఓపెనింగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు సాయితేజ్.
ఈ సందర్భాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు. డైరెక్టర్ దేవా కట్టా, ప్రొడ్యూసర్లు భగవాన్, పుల్లారావులతో నేను చేస్తున్న సినిమా ఓపెనింగ్కు వచ్చినందుకు థాంక్యూ సో మచ్ పవన్ కల్యాణ్ మామా. మ్యూజిక్ను నా ఫేవరేట్ మణిశర్మ గారు, విజువల్స్ను షామ్దత్ అందిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు, ప్రేమ కోరుకుంటున్నా అని అతను ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓపెనింగ్లో పవన్తో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సీనియర్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, ఎ.ఎం. రత్నం కూడా పాల్గొన్నారు. చిత్రలహరిలో ఓ హీరోయిన్గా కనిపించిన నివేదా పేతురాజ్ ఈ మూవీలో సాయితేజ్ జోడీగా నటిస్తోంది.